చక్రి చనిపోయిన తరువాత ఆయన ఆస్తులను అనుభవిస్తూ .. ఆయన భార్యను రోడ్డున పడేశారంటూ కుటుంబ సభ్యులపై అప్పట్లో వార్తలు షికారు చేశాయి. ఆ విషయాన్ని గురించి చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో స్పందించారు. “నిజంగా అన్నయ్య ఆస్తులను నేను లాగేసుకుంటే అద్దింట్లో ఉండాల్సిన అవసరం ఏవుంది? క్యాబుల్లో తిరగాల్సిన అవసరం ఏవుంది? అవన్నీ నిజంగా తీసుకుని ఉంటే, ఈ రోజున మేం ఇంతగా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా” అన్నారు.
“ఇదంతా కొంతమంది చేస్తోన్న తప్పుడు ప్రచారం. ఈ రోజున స్టూడియో కూడా లేకుండా చిన్న ఎక్విప్ మెంట్ ఇంట్లో పెట్టుకుని వర్క్ చేసుకుంటున్నాను. స్టూడియో నా పేరున వుందనేది కూడా అబద్ధమే. దాని విషయంలోను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారు. ఈ విషయంలో ఫైట్ చేసి అలసిపోవాలనుకోవడం లేదు. వచ్చేవి వస్తాయి .. పోయేవి పోతాయి. ఎలాంటి సమస్యలు వచ్చినా .. అవి అన్నయ్యను పోగొట్టుకున్నంత పెద్దవైతే కాదు .. అవి అంతకన్నా ఎక్కువ బాధను కలిగించలేవు” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
“అన్నయ్య నన్ను ఎంతో ప్రేమగా .. ప్రాణంగా చూసుకునేవాడు. ఆయనతో పరిచయమున్న ఏ వ్యక్తిని అడిగినా అలాంటి మంచి స్నేహితుడు గానీ .. ప్రేమికుడుగాని దొరకడని చెబుతారు. చక్రి కమర్షియల్ కాదు .. బోళా శంకరుడు .. అదే ఆయనకి మంచి అయింది .. అదే ఆయనకి చెడూ అయింది” అని అన్నారు. తనని నమ్ముకుని వచ్చిన దర్శక నిర్మాతలకు ది బెస్ట్ ఇచ్చి పంపించాలనుకునేవాడు.
సినిమా ఎంత పెద్దది .. మనకి ఎంత ఇస్తున్నారు? అనే విషయాలను ఆయన పట్టించుకునేవాడు కాదు. పెద్ద పెద్ద సినిమాలకి కూడా డబ్బులు పూర్తిగా తీసుకోకుండానే పనిచేసిన సందర్భాలు వున్నాయి. సాంగ్స్ బాగా వచ్చాయా? లేదా? అనే విషయాన్ని మాత్రమే చూసేవాడు. అందుకే కొన్ని సినిమాలు ప్లాప్ అయినా అన్నయ్య ఆడియోలు హిట్ గా నిలిచాయి. అందువల్లనే ఆయన సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడని చెప్పుకొచ్చారు.


