ఆంధ్రప్రదేశ్కు కొత్తగా పరిశ్రమలు, ఐటి కంపెనీలు రాకపోగా ఉన్నవే పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. కనుక డిగ్రీ కాగానే యువత సర్టిఫికెట్లు పట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. చేతికి అందివస్తారనుకున్న పిల్లలు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతుండటంతో తల్లితండ్రులు ఒంటరివాళ్ళుగా మిగిలిపోతున్నారు. ఏపీలో ఏ జిల్లాలో చూసినా ఇదే కధ.
ప్రభుత్వం తలుచుకుంటే రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటి కంపెనీలను రప్పించి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించవచ్చని తెలంగాణ ప్రభుత్వం నిరూపించి చూపింది కూడా. కానీ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం కంటే, వైసీపికి సేవ చేసుకునేవారికి, పార్టీకి ఉపయోగపడతారని అనుకున్నవారికీ, పార్టీలో రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే చాలా ముఖ్యమని వైసీపి ప్రభుత్వం భావించిన్నట్లుంది.
అందుకే 89 మంది సలహాదారులను నియమించుకుని వారికి జీతభత్యాలు, సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.680 కోట్లు ఖర్చు చేసిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వారిలో ఒక్క సజ్జల రామకృష్ణా రెడ్డిపైనే ఏకంగా రూ.140 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు.
ఇంతమంది సలహాదారులను నియమించుకుని, ఇన్ని వందల కోట్లు వారిపై ఖర్చు చేస్తే, వారు ప్రభుత్వానికి ఏమి సలహాలు ఇచ్చారో, వాటితో రాష్ట్రానికి ఎంత మేలు జరిగిందో చెప్పాలని నాదెండ్ల మనోహర్ నిలదీశారు. అసలు ఎంతమంది సలహాదారులు ఉన్నారో కూడా ప్రజలకు, ప్రతిపక్షాలకు, కోర్టులకు కూడా తెలియనీయకుండా ఎందుకు గోప్యత పాటిస్తున్నారో చెప్పాలని నాదెండ్ల మనోహర్ నిలదీశారు.
వారిలో ఎంతమంది పేర్లు జగన్మోహన్ రెడ్డికి తెలుసు?ఈ నాలుగున్నరేళ్ళలో వారిలో ఎంత మందితో జగన్ ముఖాముఖి మాట్లాడారో చెప్పాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. ఇంతమంది సలహాదారులు అవసరమా అని హైకోర్టు కూడా ప్రశ్నించిన సంగతిని గుర్తు చేశారు.
అసలు ప్రభుత్వంలో తమ సలహాలను వినేవారే లేరంటూ సుభాష్, శ్రీరామచంద్రమూర్తి, జూల్ఫీవంటివారు రాజీనామా చేసి వెళ్ళిపోయారు కదా?అని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ప్రతీశాఖ, విభాగాలలో అనేకమంది ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు, ఉన్నతాధికారులు ఉండగా మళ్ళీ 89 మంది సలహాదారులను నియమించుకోవలసిన అవసరం ఏమిటి?” అంటూ నాదెండ్ల మనోహర్ ప్రశ్నలు సందించారు.
వైసీపి కోసం నియమించుకున్న ఈ సలహాదారులకు జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపి జేబు లోనుంచి ఈ రూ.680 కోట్లు చెల్లిస్తుంటే ఎవరూ ఇలాగ తప్పు పట్టరు. కానీ ఈ భారాన్ని కూడా సామాన్య ప్రజలే మోయాలి కదా?ఇప్పటికే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలపై ఖర్చు చేస్తున్న వేలకోట్ల భారం మోస్తున్న సామాన్య ప్రజలపై మళ్ళీ ఈ భారం కూడా వేస్తూ, ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్పుకోవడం వైసీపి నేతలకే చెల్లునేమో?




