జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ “నాలుగు దశాబ్ధాల చరిత్ర ఉన్న టీడీపీని నేనే కాపాడనని” అంటే, కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు, “పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకి మేమే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ” అంటూ మెగా బ్రదర్స్ ఇద్దరూ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ శ్రేణులు, వాటి మద్దతుదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో వ్యవహరించకూడదని నాగబాబు సుద్దులు చెపుతూనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం తన సీటుని త్యాగం చేసి, పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎంతగానో కృషి చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మపై ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే సభ పెట్టి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ హర్షించరు.
ఆయన పవన్ కళ్యాణ్ కోసం మాత్రమే కాదు.. నాగబాబు కోసం కూడా ఎమ్మెల్సీ సీటుని త్యాగం చేయాల్సి వచ్చింది. ఒకవేళ ఆయనే ఈ ఎమ్మెల్సీ సీటు నాకే ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టి ఉంటే నాగబాబుకి ఈ పదవి దక్కేదా? కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లపై గౌరవంతోనే ఆయన మరోసారి వెనక్కు తగ్గారు.
టీడీపీలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఎస్వీఎస్ఎన్ వర్మని ఉద్దేశించి, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ సీటు దక్కించుకున్న నాగబాబు ఈవిదంగా మాట్లాడినప్పుడు, పక్కనే వేదికపై ఉన్న పవన్ కళ్యాణ్ కలుగజేసుకొని వారించి ఉంటే బాగుండేది.
ఆయన వారించకపోయినా టీడీపీ తరపున ఎవరైనా నాగబాబు వ్యాఖ్యలు ఖండించి ఉంటే బాగుండేది. కనీసం పవన్ కళ్యాణ్, నాగబాబులకు తమ అభ్యంతరం తెలియజేసి, నాగబాబు చేత వివరణ, ట్వీట్ చేయించినా బాగుండేది. కానీ అదీ జరుగలేదు.
అందుకే ఈ వ్యవహారంలో అప్పుడే వైసీపీ దూరిపోయి మెగా బ్రదర్స్ ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్లు వ్యవహరిస్తున్నారని అనగలిగింది.
ఏది ఏమైనప్పటికీ ఎస్వీఎస్ఎన్ ప్రశాంత్ వర్మ చేసిన త్యాగాలకు, పవన్ కళ్యాణ్ని గెలిపించుకునేందుకు చేసిన కృషి, పార్టీ కోసం ఇంతగా సంయమనం పాటిస్తున్నందుకు, ముఖ్యంగా ఇటువంటి అవమానాలు భరిస్తునందుకు సిఎం చంద్రబాబు నాయుడు ఆయనకు సముచిత పదవితో ఆయన గౌరవించడం చాలా అవసరం. తద్వారా పొత్తుల కోసం పార్టీ నేతలను బలి చేసుకోము.. వారిని వదులుకొము.. వారికి టీడీపీలో ఎప్పుడూ సముచిత గౌరవం, ప్రాధాన్యత ఉంటుందని పార్టీ శ్రేణులకు చాటి చెప్పిన్నట్లు ఉంటుంది.




