మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు పై జనసేన పార్టీ ఆచితూచి స్పందించింది. అవినీతికి పాల్పడినందుకా? లేక కక్ష సాధింపు కోసమా? ఆయన్ను అరెస్ట్ చేసింది అని పవన్ ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించిన పవన్.. అచ్చెన్నాయుడు అరెస్ట్పై ప్రభుత్వ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.
అవినీతి ఏ రూపంలో ఉన్నా, బాధ్యులెవరైనా జనసేన వ్యతిరేకిస్తుందని పవన్ స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు కొన్ని రోజుల ముందు అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేయడం సందేహాలకు తావిస్తోందన్నారు. ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేసే సమయంలో నిబంధనలు పాటించాలన్నారు. ఈఎస్ఐ స్కామ్తో పాటు, అన్ని అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేశారు.
అయితే జనసేన పార్టీ కీలక నేత, పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు మాత్రం పార్టీ లైన్ తప్పినట్టుగా అనిపిస్తుంది. ఆయన ఈ విషయంలో పూర్తిగా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. “మా జనసేన కార్యకర్తల ని అరెస్ట్ చేసి కొట్టించిన పాపం టీడీపీ కి అంత తేలిగ్గా పోతుందా?,” అంటూ నాగబాబు ట్విట్టర్ లో టీడీపీ వారిని ఎద్దేవా చేశారు.
అయితే టీడీపీ అభిమానులు మాత్రం కాకినాడలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అనుచరులు ఎటాక్ చేసిన ఫోటోలు ట్వీట్ చేసి ఇవి మీకు గుర్తులేవా అని ప్రశ్నిస్తున్నారు. నాగబాబు జనసేనలో వైఎస్సార్ కాంగ్రెస్ కోవర్ట్ అని, పవన్ కళ్యాణ్ ఆయనతో జాగ్రత్తగా ఉంటే మంచిదని వారు వారిస్తున్నారు.



