బాలకృష్ణపై పోటీ చేసేది ఎవరో తెలుసా?

Nandamuri Balakrishnaహిందూపురం నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణ వరుసగా రెండుసార్లు ఎన్నికైన సంగతి తెలిసిందే. ముచ్చటగా మూడోసారి కూడా గెలవడం ఖాయమే. తమపై పోటీ చేసి గెలవాలంటూ టిడిపి నేతలకు తొడ కొట్టి సవాళ్ళు విసురుతున్నవారు వైసీపీలో చాలా మందే ఉన్నారు.

కనుక వారిలో ఎవరో ఒకరిని బాలయ్యని ఓడించేందుకు బరిలో దింపుతుందనుకొంటే, దీపికా రెడ్డిని హిందూపురం నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా నియమించడం విశేషం. గత ఎన్నికలలో వైసీపీ ప్రభంజనంలో కూడా కర్నూలుకు చెందిన మాజీ ఐపిఎస్ అధికారి ఇక్బాల్ హిందూపురం నుంచి బాలయ్యమీద పోటీ చేసి గెలవలేకపోయారు.

ADVERTISEMENT

బాలయ్యను ఢీకొని ఓడిపోయారనే సానుభూతితో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. కనుక ఈసారి కూడా ఆయనే బాలయ్యని ఢీకొనాలనే ఉద్దేశ్యంతో అప్పటి నుంచే నియోజకవర్గంలో తిరుగుతూ పట్టు పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనే నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా కూడా కొనసాగుతున్నారు.

అయితే ఇటీవల సిఎం జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు దానికి ఇక్బాల్‌కి ఆహ్వానం రాలేదు! కానీ దీపికా రెడ్డికి ఆహ్వానం రావడంతో నియోజకవర్గంలో అందరూ ఉలిక్కి పడ్డారు.

ఆమెను సమీక్షా సమావేశానికి ఆహ్వానింపజేయడం వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ఆయనకు అత్యంత సన్నిహితుడుగా పేరొందిన పెనుకొండకు చెందిన ఓ వైసీపీ నాయకుడు దీపికారెడ్డి పేరును ప్రతిపాదించగా, ఐప్యాక్ కూడా ఆమె అభ్యర్ధిత్వాన్ని సమర్ధించిన్నట్లు తెలుస్తోంది.

బాలయ్యపై శక్తివంతుడైన నాయకుడిని నిలబెట్టి ఓడిపోవడం కంటే, ఎవరికీ అంతగా పరిచయం లేని దీపికా రెడ్డిని నిలబెట్టి ఆమె చేత బాలయ్యని ఓడించగలిగితే ఆ కిక్కే వేరని పెద్దిరెడ్డి వర్గం భావిస్తోంది. ఒకవేళ ఆమె బాలయ్య చేతిలో ఓడిపోయినా అందుకు వైసీపీ పెద్దగా బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు. కనుక దీపికారెడ్డిని నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది.

ఆమె బాలయ్యని ఓడిస్తారా లేదా బాలయ్య చేతిలో ఓడిపోతారా?అనేది అప్రస్తుతం. కానీ ఇంతకాలం హిందూపురం టికెట్‌ తమదే అని గట్టి నమ్మకంతో ఉన్న ఇక్బాల్ వర్గం ముందు ఆమెను ఓడించకుండా జాగ్రత్తపడటం అవసరం. అటువంటి పరిస్థితే వస్తే మళ్ళీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రం అడ్డం వేయక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories