ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం విడుదలపై నెలకొన్న సస్పెన్స్కు తెర తొలగి పోయింది. ముందు నుండి అనుకుంటున్నట్లుగా ఈ చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. ‘డిక్టేటర్’ చిత్రంతో బాలకృష్ణ సంక్రాంతి బరిలో నిలవడంతో ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని వాయిదా వేసే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. అయితే బాబాయి సినిమా కోసం తాను ఆగాల్సిన అవసరం లేదని భావించాడో ఏమో కాని ఎన్టీఆర్ ముందు నుండి అనుకుంటున్నట్లుగానే సంక్రాంతికి రాబోతున్నాడు.
నేడు దీపావళి సందర్బంగా చిత్రంకు సంబంధించిన ఒక పోస్టర్ను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు. ఆ పోస్టర్లో సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తాం అంటూ ప్రకటించారు. దాంతో నందమూరి ఫ్యాన్స్లో గత కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. సంక్రాంతికి ఇద్దరు నందమూరి హీరోలు కనీసం వారం గ్యాప్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దాంతో నందమూరి ఫ్యాన్స్కు పండుగ మూడు రెట్లు అవ్వడం ఖాయం. రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ఎన్టీఆర్కు 25వ సినిమా. దాంతో ఈ సినిమాను ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అందువల్లే ముందు అనుకున్న సమయానికి సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.





