పొత్తుల కథ ఒక కొలిక్కి రావడం తో ఇక రెండు పార్టీల నేతలు యాత్రలతో ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ వార్తతో చనిపోయిన పార్టీ శ్రేయోభిలాషులు, బాబు అభిమానుల కుటుంబాలను పరామర్శించడానికి “నిజం గెలవాలి” కార్యక్రమంతో ప్రజలలోకి వెళ్తున్నారు నారా భువనేశ్వరి.
యాత్రను మొదలుపెట్టడానికి ముందు భువనేశ్వరి తిరుమల శ్రీ వారి దర్శనం పూర్తి చేసుకుని అనంతరం తమ సొంత నియోజక వర్గమైనా నారావారిపల్లె కు చేరుకున్నారు. అలాగే లోకేష్ కూడా బాబు అరెస్టుతో అటకెక్కిన “బాబుతో గ్యారంటీ భవిష్యత్ కు షూరిటీ” యాత్రను నవంబర్ 1 నుండి పునప్రారభించనున్నారు. పవన్ కూడా తన 5 “వారాహి యాత్ర”తో ప్రజలలోకి వెళ్ళడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. ఇలా ప్రతిపక్ష పార్టీలు రెండు తమ తమ పార్టీ యాత్రలతో అధికార పక్షం పై దండయాత్రకు సిద్దమవ్వడంతో అధికార వైసీపీ కూడా తనదైన అడుగు వేయడానికి “బస్సు యాత్ర”ను ఎంచుకుంది.
ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు వైసీపీ ప్రభుత్వం. ప్రతి రోజు మూడు ప్రాంతాల చొప్పున యాత్రలు చేపట్టి ఆయా ప్రాంతాలలో బహిరంగ సభలు నిర్వహించి ప్రతిపక్షాలను ధీటుగాఎదుర్కోవడానికి అధికార వైసీపీ సిద్దమయ్యింది.స్థానిక ఎమ్మెల్యే లు,సమన్వయకర్తలతో బస్సు యాత్రలు చేపట్టాలని వైసీపీ అధిష్టానం నుండి ఆదేశాలు రావడంతో స్థానిక వైసీపీ నేతలు ఆ పనిలో బిజీగా ఉన్నారు.
అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలతో ప్రజల మధ్య ఉన్న జగన్ అధికారం చేపట్టిన తరువాత మాత్రం పరదాలతో ప్రజల ముందుకు రావడంతో కనీసం ఈ బస్సు యాత్రలో అయినా జగన్ పాల్గొంటారా లేదా అన్న సందేహం అటు వైసీపీ నేతలను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే స్థానిక నేతలు అంటూ జగన్ ప్రస్తావించడం వైసీపీ నేతలలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎదురైనా చేదు అనుభవాలను గుర్తుచేసుకుంటున్నారు.బాబు అరెస్టుతో రాష్ట్రంలో మారీన రాజకీయ పరిణామాలతో ఇక ఈయాత్ర తో కొత్తగా ఇంకేం ఎదురుకుంటారో వైసీపీ నేతలు చూడాలి మరి.




