ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు వైపుకు వెళ్తున్నాయో సామాన్య ప్రజానీకానికి ఏ మాత్రం అంతుచిక్కడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం యొక్క ముఖ్య నేతలందరూ అరెస్ట్ లు కాబోతున్నారని ఇప్పటికే మీడియా వర్గాలు చెవులు చిల్లులు పడేలా చెప్తోన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే రాజమండ్రి జైలులో చంద్రబాబు ముప్పతిప్పలు పడుతుండగా, అతి త్వరలో లోకేష్ కూడా అరెస్ట్ కాబోతున్నారని చాలా బలంగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు తాజా పరిణామాలు కూడా దోహదం చేస్తున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ 14గా లోకేష్ పేరును సీఐడీ చేర్చగా, ఇందుకు ప్రతి సవాల్ గా లోకేష్ తన తదుపరి ‘యువగళం’ షెడ్యూల్ ని రిలీజ్ చేసారు.
అయితే ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో లోకేష్ తన పాదయాత్రను వాయిదా వేసుకోవడం విశేషం. శుక్రవారం నాడు సాయంత్రం నుండి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా, దీనిని మరో వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. అంతిమంగా ఈ పరిణామాలన్నీ లోకేష్ అరెస్ట్ కు సంకేతాలుగా భావించవచ్చు.
ఇదిలా ఉండగా తాజాగా ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. ‘స్కిల్ స్కాం’ కేసులో చంద్రబాబు, లోకేష్ లతో పాటు నారా బ్రాహ్మణి, భువనేశ్వరిల పేర్లు కూడా సీఐడీ మెమో ఫైల్ చేసినట్లు తమకు సమాచారం అందిందని, దీనిపై ఎలా పోరాడాలో తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేసారు.
చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ… వీరంతా ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొన్న వారు. కానీ బ్రాహ్మణి, భువనేశ్వరిలు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వ్యాపార లావాదేవీలను మాత్రమే చూసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు కుటుంబ సభ్యులను కూడా జగన్ వీడబోరా? అన్న చర్చలు ఊపందుకున్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు భయపడి చేస్తోన్న ఈ అరెస్ట్ ల పర్వానికి అంతం ఉండదా? నిజంగా వీరంతా అరెస్ట్ లు కాకపోతే జగన్ రాజకీయ జీవితానికి శుభంకార్డు పడినట్లేనని భావించడం వలనే ఒక్కసారిగా ఇలాంటి కార్యాచరణ వైసీపీ చేస్తోందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఒకవేళ ఇన్ని అరెస్ట్ లు జరిగినా కూడా జగన్ నిజంగా ప్రజాక్షేత్రంలో విజయం సాధిస్తారా? కాలమే సమాధానం ఇవ్వాలి.



