చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ వెళ్ళి తండ్రిని విడిపించుకొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే జైలుకి పంపించిందని జాతీయమీడియా గ్రహించేలా చేయగలిగారు కానీ తండ్రిని విడిపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు.
మరోపక్క రాష్ట్రంలో పార్టీని కూడా కాపాడుకోవలసి ఉంది. నేటికీ పార్టీ ముఖ్యనేతలు గట్టిగానే పోరాడుతున్నప్పటికీ, వారందరినీ ముందుండి నడిపించేవారు కనబడటం లేదు. కనుక నారా లోకేశ్ రాష్ట్రానికి తిరిగివచ్చి యువగళం పాదయాత్ర ప్రారంభించడానికి సిద్దపడ్డారు.
కానీ ఆయన రాష్ట్రంలో అడుగుపెట్టగానే అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడీ అధికారులు సిద్దంగా ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తుండటంతో, పాదయాత్ర విషయంలో వెనక్కు తగ్గారు. ఈ దశలో నారా లోకేశ్ కూడా జైలులో ఉంటే టిడిపి ఇంకా నీరసించిపోతుంది. కనుక ఏపీకి దూరంగా ఢిల్లీలో ఉన్నా మంచిదే. అక్కడి నుంచే పార్టీ సీనియర్ నేతలతో మాట్లాడుతూ కార్యాచరణ రూపొందించుకోవచ్చని భావించి వెనక్కు తగ్గి ఉండవచ్చు.
అయితే రాష్ట్రంలో టిడిపిని ముందుండి నడిపించే నాయకుడు ఇప్పుడు చాలా అవసరం. అందుకు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ఇద్దరే కనిపిస్తున్నారు. వారిలో భువనేశ్వరి వయసు, ఆరోగ్యరీత్యా చురుకుగా ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనలేకపోవచ్చు.
కనుక నారా బ్రాహ్మణి ముందుండి టిడిపిని నడిపించవలసి రావచ్చు. ఇంతకాలం ఆమె రాజకీయాలలో లేనప్పటికీ మావగారు, భర్త ద్వారా టిడిపి గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి పూర్తి అవగాహన పొందారు. ఆమె ముందుకు వస్తే టిడిపికి మాత్రమే కాదు… రాష్ట్రంలో యువత, మహిళలకు కూడా ప్రాతినిధ్యం వహించినట్లవుతుంది.
చదువు, ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపారాలు, ఆర్ధిక అంశాలపై బ్రాహ్మణి అవలీలగా మాట్లాడగలరు. ఇటీవల మొట్ట మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆమె రాజకీయాల గురించి కూడా చాలా చక్కగానే మాట్లాడారు. కనుక ఒకవేళ నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేయలేకపోతే భర్త తరపున ఆమె పాదయాత్ర చేపట్టే అవకాశం ఉంది.
నారా లోకేశ్ యువగళం పాదయాత్రతో చాలా నేర్చుకొన్నానని పదేపదే చెప్పేవారు. కనుక నారా బ్రాహ్మణి మిగిలిన యాత్రను పూర్తిచేయగలిగితే, అది ముగిసేలోగా ఆమె కూడా రాజకీయ పరిణతి సాధిస్తారు. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలు, వృద్ధుల సానుభూతిని టిడిపికి సంపాదించగలిగితే వచ్చే ఎన్నికలలో ఇది టిడిపికి చాలా కలిసిరావచ్చు.



