2019 ఎన్నికల ఫలితాల తరువాత “అంటే ఇప్పుడు మీ హీరో ఓడిపోయాడు” అంటూ టీడీపీ శ్రేణులను, పార్టీ కార్యకర్తలను హేళన చేసిన వైసీపీ నేతలకు 2024 ఎన్నికలలో 90 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గి, వైసీపీని అధః పాతాళానికి తొక్కి నాలుగు దశాబ్దాల తరువాత మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరేశారు టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్.
గెలుపు ముఖ్యం కాదు గెలిచిన తీరు ముఖ్యం అన్నట్టుగా సాగింది మంగళగిరిలో నారా లోకేష్ వేట. లోకేష్ కు ప్రత్యర్థిగా ఎవరిని పోటీకి దింపాలో కూడా అర్ధం కానీ పరిస్థితికి జగన్ ను తీసుకువచ్చారు లోకేష్. గత ఎన్నికలలో లోకేష్ మీద సుమారు 4 వేల ఓట్ల తేడాతో గెలిచిన ఆళ్ళ రామకృష్ణ మీద నమ్మకం లేక ఆయన స్థానంలో గంజి చిరంజీవిని తీసుకువచ్చారు.
దీనితో జగన్ కు ‘బై’ చెప్పి షర్మిలకు ‘హాయ్’ చెప్పారు ఆర్కే. ఇక స్థానిక ఎన్నికల ప్రచార శైలిని, నియోజకవర్గ ప్రజల తీరును గమనించిన జగన్ గంజికి హ్యాండ్ ఇచ్చి మురుగుడు లావణ్య ను తెర మీదకు తెచ్చారు. గెలిస్తే ఆడవారి చేతిలో లోకేష్ పరాజయం అంటూ ప్రచారం చేసుకోవచ్చు, ఒక వేళ వైసీపీ ఓడినా ఒక మహిళ పై గెలిచావు అని లోకేష్ గెలుపు స్థాయిని తగ్గించవచ్చు అన్న ఉద్దేశంతో జగన్ లావణ్యకు అవకాశం ఇచ్చారు.
అయితే లోకేష్ కు వ్యతిరేకంగా మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరుపున ప్రచారం చేయడానికి కూడా తడబడిన మురుగుడు కుటుంబానికి గంజి చిరంజీవిని తోడుగా పెట్టి తిరిగి ఆళ్ళను పార్టీలోకి ఆహ్వానించి త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్లారు జగన్. అయినా జగన్ తన కుయుక్తితో వేసిన పాచిక లోకేష్ విజయం ముందు తల వంచక తప్పలేదు. ప్రత్యర్థి ఎవరైనా గెలిచేది అతడే, ఎగిరేది పసుపు జెండానే అన్నట్టుగా “ఐదేళ్ల తన ఓటమిని విజయానికి కంచుకోటగా” మార్చుకున్నారు లోకేష్.
2024 ఎన్నికల ఫలితాలు వై నాట్ 175 అంటూ వైసీపీ కన్నకల 11 గా మార్చి జగన్ కు చీకటి విషాదాన్ని మిగిల్చింది. అయితే రాజధాని అమరావతి ప్రాంతానికి అతి చేరువలో ఉన్న మంగళగిరి రాష్ట్రానికి అత్యంత కీలకమైన నియోజకవర్గాలలో ఒకటిగా నిలిచింది. ఇటువంటి ప్రాంతంలో పట్టు సాధించడం అంటే రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే అవుతుంది. దాన్ని సాధించి టీడీపీ పార్టీకి హీరోగా వైసీపీ పాలిట విలన్ గా మారారు లోకేష్.
ఓడాడు…అవమానాలు ఎదుర్కున్నాడు…నిలబడ్డాడు… నిలదొక్కుకున్నాడు…పార్టీని నిలబెట్టాడు…అలాగే కొట్టాడు… గురి చూసి గట్టిగా కొట్టాడు.. వైసీపీ తిరిగి నిలబడలేనంత బలహీనంగా చేసి టీడీపీని మరెవ్వరు కదిలించలేనంత బలంగా మంగళగిరిని టీడీపీ కంచుకోటగా చేసాడు. ఓటమితో మొదలు పెట్టిన రాజకీయ ఆటను గెలుపు తో ముగించలేదు. ఓటమిని గెలుపుకి మెట్టుగా ఎంచుకుని గెలుపుని పార్టీ పునాదిగా మార్చాడు.
గెలిచిన నాటి నుంచి తీసుకున్న శాఖలతో పాటుగా తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజాదర్బార్ నిర్వహిస్తూ తన వద్దకు వచ్చిన వినతులకు, సమస్యలకు తగిన పరిష్కారాలు చూపిస్తూ ఒక నాయకుడుగా, ఒక నేస్తంగా ఎదుగుతూ ఒదుగుతున్నాడు లోకేష్.
కూటమి ప్రభుత్వానికి ముందు, కూటమి ప్రభుత్వానికి తరువాత అనేలా మంగళగిరి రూపురేఖలు మార్చడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనితో ఇక మంగళగిరిలో వైసీపీకి “మంగళం” పాడినట్టే అంటున్నారు స్థానిక ప్రజలు.




