ఈరోజు శాసనమండలిలో బడ్జెట్పై జరిగిన చర్చలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నప్పుడు, జగన్ శాసనసభ సమావేశాలకు హాజరవకపోవడంపై రెండు పార్టీల సభ్యులమద్య విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి. ఇదివరకు చంద్రబాబు నాయుడు కూడా శాసనసభ సమావేశాలకు హాజరుకాకుండా పారిపోయారంటూ వైసీపి ఎమ్మెల్సీలు ఎద్దేవా చేశారు. వారి నోళ్ళు మూతపడేలా మంత్రి నారా లోకేష్ చాలా ఘాటుగా జవాబిచ్చారు.
“మా తండ్రిగారు మీ అధినేత జగన్మోహన్ రెడ్డిలాగ శాసనసభ సమావేశాలకు రాకుండా పారిపోలేదు. సుమారు రెండున్నరేళ్ళు ప్రతీ సమావేశానికి హాజరయ్యారు.
మా తండ్రి చంద్రబాబు నాయుడుగారిని సభలో ఏకాకీగా చేసి ఆడుకునేందుకు మా ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్ చేసి బయటకు పంపించేశారు. అయినప్పటికీ ఆయన ఒంటరిగా సింహంలా మీ వైసీపి సభ్యులందరినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు తప్ప మీ అధినేత జగన్లాగా భయపడి శాసనసభకు రావడం మానుకోలేదు.
కానీ ఏనాడైతే శాసనసభలో ముఖ్యమంత్రి, స్పీకర్ సమక్షంలో మీ వైసీపి ఎమ్మెల్యేలు మా తల్లిగారిని దూషిస్తూ మా తండ్రిగారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారో వాటిని సహించలేక, అదే విషయం శాసనసభ స్పీకర్కి, రాష్ట్ర ప్రజలకి తెలియజేసి బయటకు వచ్చేశారు.
నాడు శాసనసభలో స్పీకర్, ముఖ్యమంత్రి సాక్షిగా మీ ఎమ్మెల్యే (కొడాలి నాని) మా తల్లితండ్రులని నీచాతినీచంగా అవమానిస్తుంటే మీకెవరికీ తప్పుగా అనిపించలేదు. ఎవరూ వారించలేదు. పైగా మీ అధినేత మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు కూడా. అంటే ఆయన చేసింది తప్పని మీ అధినేతకి కూడా అనిపించలేదన్న మాట.
కానీ ఇప్పుడు మేము మీ అధినేత జగన్మోహన్ రెడ్డి శాసనసభకు ఎందుకు రావడం లేదని అడిగితే అది మీకు పెద్ద తప్పుగా అనిపిస్తోంది! అయినా శాసనసభకు వెళ్ళి ప్రజాసమస్యలపై మాట్లాడమనే కదా ప్రజలు మీ నాయకుడిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు? మరి ఎందుకు రావడం లేదని మేము కాదు… మీరే మీ అధినేతని నిలదీసి అడగాలి. కానీ మీకా ధైర్యం లేదు కనుక మేము అడుగుతున్నాము.
మీరు మా తల్లిని, కుటుంబంలో ఆడవాళ్ళ గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతారు. చివరికి విజయమ్మ, షర్మిలగారి గురించి మీరే చాలా తప్పుగా మాట్లాడుతుంటారు. కానీ మేము ఏనాడూ అలా తప్పుగా మాట్లాడలేదు. మా తల్లితండ్రులను సభలో అవమానిస్తే నాకు కోపం రాదా? అందరూ జగన్లాగే ఉంటారని అనుకుంటున్నారా?” అంటూ మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు.
గత ఎన్నికల సమయంలో వైసీపి నేతలు అందరూ నారా లోకేష్ని టార్గెట్ చేసుకొని నీచాతినీచంగా అవహేళన చేస్తుండేవారు. కానీ వారందరికీ ఇప్పుడు శాసనమండలిలోనే నారా లోకేష్ ఈవిదంగా సమాధానం చెప్పి నోళ్ళు మూయించడం విశేషం. వారి విమర్శలను నారా లోకేష్ సానుకూలంగా స్వీకరించి తనలో లోపాలను సరిదిద్దుకొని అన్ని విదాలా తనని తాను తీర్చి దిద్దుకోగలిగారు. కానీ వైసీపి అధినేత జగన్లో లోపాలను ఎవరు ఎంతగా విడమరిచి చెపుతున్నా చెవికి ఎక్కించుకోకపోగా ఎదురుదాడి చేస్తున్నారు. లోపాలున్నాయని తెలిసి సరిచేసుకోలేనివారు ఎన్నటికీ బాగుపడలేరు. అటువంటి వారిని నమ్ముకున్నవారు కూడా బాగుపడలేరు.




