టిడిపి హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, ఇంకా రావలసిన పరిశ్రమలు అన్నీ తెలంగాణ రాష్ట్రానికి తరలిపోయేలా చేస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వం జగన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలంటూ నారా లోకేష్ చేసిన ట్వీట్ చాలా ఆలోచింపజేస్తోంది. తమ ప్రభుత్వం ఎంతో శ్రమించి తైవాన్లో అమెరికన్ కంపెనీ ఫాక్స్కాన్ కంపెనీని ఆంధ్రాలో పెట్టుబడి పెట్టి పరిశ్రమ స్థాపించడానికి ఒప్పిస్తే, జగన్ రెడ్డి ప్రభుత్వం దానిని తెలంగాణకు తరిమేసిందని లోకేష్ ట్వీట్ చేశారు.
ఒకవేళ ముఖ్యమంత్రి, పరిశ్రమల మంత్రి చెప్పుకొంటున్నట్లు ఏపీలో మంచి వ్యాపార అవకాశాలు, పారిశ్రమలకు అనుకూలమైన వాతావరణం, ప్రభుత్వ సహాయసహకారాలే ఉన్నట్లయితే సుమారు రూ. 19,000 కోట్లు పెట్టుబడితో వేలాదిమందికి ఉద్యోగాలు కల్పించగల ఫాక్స్కాన్ కంపెనీ తెలంగాణకు ఎందుకు తరలిపోయింది?గత ఎన్నికలలో ‘బైబై బాబు…’ అంటూ వైసీపీ ప్రచారం చేయగా ఆ తర్వాత ఫాక్స్ కాన్ వంటి భారీ పరిశ్రమలు ‘బై బై ఏపీ…’ అని చెప్పి వెళ్ళిపోతున్నాయని,” ట్వీట్ చేశారు.
అమెరికాకు చెందిన ఈ కంపెనీలో యాపిల్ తదితర కంపెనీలకు చెందిన మొబైల్ ఫోన్స్, ఐప్యాడ్స్ వంటివి తయారవుతుంటాయి. అమెరికా వెలుపల ఏర్పాటవుతున్న అతిపెద్ద కంపెనీ ఇది. ఇంతకాలం తైవాన్లో నడుస్తుండేది. కానీ తైవాన్ దేశంపై చైనా పెత్తనం చలాయించాలని చూస్తుండటంతో ఫాక్స్కాన్తో సహా పలు అమెరికన్ కంపెనీలు భారత్కు తరలివస్తున్నాయి. ఈ అవకాశాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు ఫాక్స్కాన్ కంపెనీని ఏపీలో పెట్టేందుకు ఒప్పించారు.
ఈ కంపెనీ కోసం తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు పోటీపడగా, చంద్రబాబు నాయుడు కృషి, ప్రయత్నాల వలన మొదట ఈ కంపెనీ ఏపీలో ఏర్పాటుచేసేందుకు అంగీకరించింది. అదే ఏపీకి వచ్చి ఉంటే దానిలో వేలాదిమందికి ఉద్యోగాలు లభించడమే కాకుండా దాని అనుబంద పరిశ్రమలు అనేకం కూడా వచ్చి ఉండేవి. మళ్ళీ వాటిలో కూడా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున లభించి ఉండేవి.
కానీ హైదరాబాద్కు తరలిపోయింది. ఈనెల 15వ తేదీన తెలంగాణ సిఎం కేసీఆర్, ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో కలిసి హైదరాబాద్ సమీపంలో కొంగర్కలాన్ వద్ద ఈ పరిశ్రమకు భూమిపూజ చేయబోతున్నారు.



