టిడిపి యువనేత నారా లోకేష్ నిన్న రావెలలో ‘అమరావతి ఆవేదన సభ’లో రాష్ట్రాభివృద్ధి గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “ఈ నాలుగేళ్ళ జగన్ పాలనలో వేధింపులు భరించలేక చాలా పరిశ్రమలు హైదరాబాద్కు తరలిపోయాయి. నా స్నేహితుడు ఒకరు నాతో మాట్లాడుతూ, ఏపీలో ఈ వేధింపులను, చేదు అనుభవాలను చూస్తున్న పారిశ్రామికవేత్తలు భవిష్యత్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినా రాష్ట్రానికి వచ్చేందుకు సందేహిస్తారేమో?అని అన్నారు. నిజమే కదా?ఇటువంటి విపరీత ధోరణి ఉన్న ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎవరు మాత్రం ధైర్యం చేసి రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారు?
మళ్ళీ మనం పెట్టుబడిదారుల, పారిశ్రామికవేత్తల నమ్మకం పొందాలంటే ఎంతగానో శ్రమించాల్సి ఉంటుంది. ప్రజలు జగన్ను నమ్మి అధికారం అప్పజెప్పితే, రాష్ట్రాన్ని చూసి అందరూ జాలిపడే దుస్థితికి, ప్రభుత్వాన్ని చూసి అందరూ భయపడే పరిస్థితికి తీసుకువచ్చేశారు. హైదరాబాద్లో మొన్న ఎకరం రూ.100 కోట్లు పలికింది. అది కులం వలనా… మతం వలనా?
కేవలం హైదరాబాద్ అభివృద్ధి సాధించడం వలననే కదా?తెలంగాణ గురించి పత్రికలు, టీవీలలో నిత్యం అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించే ఎక్కువగా వార్తలు వస్తుంటాయి. కానీ మన ఏపీ గురించి ఏమి వార్తలు వస్తుంటాయో అందరికీ తెలుసు. ఏ కులం, మతం చూసి అన్ని కంపెనీలు హైదరాబాద్, బెంగళూరుకు తరలివెళ్ళిపోతున్నాయి?కొత్తగా పరిశ్రమలను తీసుకురాకపోగా ఉన్నవాటిని వేధించి రాష్ట్రం విడిచి పారిపోయేలా చేశారు.
జగన్ ప్రభుత్వం అమరావతిని పూర్తిచేసి ఉండి ఉంటే నేడు ఏపీ కూడా అదేవిదంగా అభివృద్ధి చెంది ఉండేది. కానీ రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాల్సిన అమరావతిపైనే జగన్ కులం ముద్రవేసి పాడుబెట్టి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. వైసీపీ రాజకీయ లబ్ధి కోసం ప్రజల మద్య కులం, మతం, ప్రాంతాల పేరుతో చిచ్చు పెట్టారు.
ప్రజలు కోరుకొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇదేనా?అందరూ ఆలోచించాలి. రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణపనులు మొదలుపెట్టి యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తాము. అమరావతిలో రిజర్వ్ జోన్ రద్దు చేసి మళ్ళీ జీవో 41ని అమలుచేస్తాం. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులందరూ ఇంతకాలంగా అనుభవిస్తున్న మానసిక క్షోభని తీర్చి వారికి పూర్తి న్యాయం చేస్తాం.
అమరావతి నిర్మాణపనులు మొదలుపెట్టడంతో పాటు మళ్ళీ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంపై నమ్మకం కల్పించి పరిశ్రమలను, ఐటి కంపెనీలను రప్పిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపిస్తాం,” అని నారా లోకేష్ భరోసా ఇచ్చారు.



