ఒకప్పుడు బహిరంగ సభలు, సమావేశాలలో మాట్లాడేందుకు తడబడిన నారా లోకేష్ వైసీపీ నేతల విమర్శల పుణ్యమాని సాధనతో ఇప్పుడు అనర్గళంగా మాట్లాడుతున్నారు. కానీ ఆయనను అవహేళన చేయించిన వారి అధినేత జగన్ మాత్రం నేటికీ ప్యాలస్-ప్రెస్మీట్లో కూడా కాగితం చూసి చదవాల్సిందే. అయినా తడబడుతూనే ఉంటారు.
కానీ మంత్రి నారా లోకేష్ సొంత రాష్ట్రంలోనే కాదు ఢిల్లీలో, విదేశాలలో కూడా అనర్గళంగా మాట్లాడగలరని ఎప్పుడో నిరూపించుకున్నారు.
ఈవిషయంలో మంత్రి నారా లోకేష్ నేడు మరో మెట్టు అధిరోహించబోతున్నారు. బిహార్ శాసనసభ రెండో దశ ఎన్నికలు ఈ నెల 11న జరుగబోతున్నాయి. ఆ ఎన్నికల ప్రచార సభలో ఎన్డీయే తరపున ప్రచారంలో పాల్గొనబోతున్నారు! ఈరోజు సాయంత్రం పాట్న చేరుకొని నేడు, రేపు (ఆదివారం) పాట్నాలో ఎన్నికల ప్రచార సభలలో పాల్గొనబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏవిధంగా, ఎంత వేగంగా అభివృద్ది చెందుతోందో వివరిస్తున్నారు.
అమరావతి నిర్మాణ పనులలో వేలాదిమంది బీహారీలు పాల్గొంటున్నారు. అలాగే ఏపీలో గ్రానైట్, సిమెంట్ తదితర పరిశ్రమలలో, భవన నిర్మాణ, రవాణా రంగాలలో వేలాదిమంది బీహారీలు పని చేస్తున్నారు. వారందరూ ఎన్నికలలో ఓట్లు వేసేందుకు ఇప్పటికే బీహార్ చేరుకున్నారు కూడా. కనుక బీహారీలకు ఏపీలోని మౌలిక వసతులు, జరుగుతున్న అభివృద్ధి గురించి బాగా తెలుసు. కనుక వారు మంత్రి నారా లోకేష్తో సులువుగా కనెక్ట్ కాగలరు.
అందువల్ల ప్రధాని మోడీ సూచన మేరకు బీజేపి అధిష్టానం మంత్రి నారా లోకేష్ని పాట్నాలో ఎన్డీయే తరపున ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించింది.
బీహార్ ప్రజలకు అల్లు అర్జున్, రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ వంటి తెలుగు సినీ నటులు బాగా తెలుసు. కానీ నారా లోకేష్ సినీ నటుడు కారు. కానీ అంత గొప్ప ఇమేజ్ ఉన్న రాజకీయ నాయకుడుగా ఇప్పటికే గుర్తింపు పొందారు. ముఖ్యంగా ప్రధాని మోడీకి అత్యంత ఆప్తుడుగా మారారు. కనుక నారా లోకేష్కి ఈ ఎన్నికల ప్రచారం ఓ రకంగా రాజకీయాలలో ప్రమోషన్ వంటిదే అని చెప్పవచ్చు.






