మంగళగిరిలో వైసీపీ అప్పుడే ఓటమికి అంగీకరించేసిందా?

Nara_Lokesh_YSRCPగత శాసనసభ ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి టిడిపి యువనేత నారా లోకేష్‌ పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. కనుక ఆయనను ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి లభిస్తుందనుకొంటే రాబోయే ఎన్నికలలో టికెట్‌ కూడా ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది.

జగన్‌, ఐప్యాక్ వేర్వేరుగా చేయించుకొన్న సర్వేలలో మంగళగిరి ప్రజలు ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని తేలడంతో గంజి చిరంజీవికి మంగళగిరి బాధ్యతలు అప్పగించింది. కానీ ఆయన పనితీరు పట్ల కూడా అసంతృప్తి చెందటంతో ఆయన స్థానంలో కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుకను మంగళగిరి నుంచి బరిలో దింపాలని యోచిస్తున్నట్లు తాజా సమాచారం.

ADVERTISEMENT

మంగళగిరి నియోజకవర్గంలో చేనేత కుటుంబాలు ఎక్కువ ఉన్నందున అదే కుటుంబం నుంచి వచ్చిన బుట్టా రేణుక అయితే సులువుగా వారిని ఆకట్టుకొని గెలవగలరని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే వేరే జిల్లా నుంచి అభ్యర్ధిని తెచ్చి మంగళగిరిపై రుద్దితే మొదట పార్టీలో నేతలు, కార్యకర్తలే తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది కనుక వారందరికీ నచ్చజెప్పి ఒప్పించే బాధ్యత జిల్లా సమన్వయకర్త మర్రి రాజశేఖర్‌కు అప్పగించిన్నట్లు తెలుస్తోంది. తెరవెనుక ఈ పనులు పూర్తయితే బుట్టా రేణుక పేరును అధికారికంగా ప్రకటించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.

గత ఎన్నికలలో నారా లోకేష్‌ను అవలీలగా ఓడించిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించాలని నిర్ణయించినప్పుడే వైసీపీ తొలిసారిగా తన ఓటమిని అంగీకరించిన్నట్లయింది లేకుంటే మళ్ళీ ఆయనకే టికెట్‌ ఇచ్చి ఉండేది కదా?ఇక గంజి చిరంజీవిని తెచ్చినా ఆయన నారా లోకేష్‌ని ఢీకొని నిలబడలేరనుకొన్నప్పుడు మళ్ళీ రెండోసారి వైసీపీ ఓటమిని అంగీకరించిన్నట్లయింది. ఇప్పుడు కర్నూలు జిల్లా నుంచి అభ్యర్ధిని దిగుమతి చేసుకోబోతుండటం నిజమైతే ముచ్చటగా మూడోసారి కూడా వైసీపీ ఓటమిని అంగీకరించిన్నట్లే భావించవచ్చు.

గత ఎన్నికలలో నారా లోకేష్‌ని ఎందుకూ పనికిరాడని తీసిపడేసిన వైసీపీ ఈసారి కూడా అలాగే ఓడించగలమని ఎందుకు భావించడం లేదు?ఆయనను ఎదుర్కొనేందుకు సరైన అభ్యర్ధి కోసం ఎందుకు వెతుకులాడుతోంది?అంటే సమాధానాలు చాలానే ఉన్నాయి.

ముందుగా చెప్పుకోవలసింది నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర గురించి! దాంతో నారా లోకేష్‌ తానేమిటో ప్రజలకు నిరూపించి చూపుకొంటున్నారు.

రెండోది అమరావతి. దానిని కాదని మూడు రాజధానులని మోసగించినందుకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే అమరావతిలో సెంటు భూములు పంచిపెట్టి ఓటు బ్యాంకు సృష్టించుకొనే ప్రయత్నం చేస్తోంది. అయితే వైసీపీలో ఒక్క ఆళ్ళ రామకృష్ణా రెడ్డికే కాదు… ఆ ఉమ్మడి జిల్లాలలో వైసీపీ ఎమ్మెల్యేలందరి పరిస్థితి ఇదే. కాకపోతే వారి విషయంలో వైసీపీ ఇంకా బయటపడలేదు అంతే!

ఇక మూడో కారణం.. గత ఎన్నికలలో వైసీపీ-జగన్‌ ప్రభంజనం ఏర్పడింది కానీ రాబోయే ఎన్నికలలో అది ఉండదు. పైగా జనసేన చాలా పుంజుకొంది. బిజెపి కూడా దగ్గుబాటి పురందేశ్వరిని బరిలోకి దింపడంతో ఆమె కూడా అప్పుడే వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించేసి రోజూ నిలదీస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

కనుక వచ్చే ఎన్నికలలో ఒక్క మంగళగిరిలోనే కాదు… రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ఎదురీత తప్పదు. ఎదురీది 175 సీట్లు గెలిచేసుకొంటే ఇక జగన్‌కు ఎప్పటికీ తిరుగే ఉండదు.

ADVERTISEMENT
Latest Stories