టిడిపి యువనేత నారా లోకేష్ బుదవారం 199వ రోజు చింతలపూడి శాసనసభ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ముఖ్యంగా మహిళలు, రైతు కూలీలు, విద్యార్థులు నారా లోకేష్కు షేక్ హ్యాండ్ ఇచ్చి సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
నారా లోకేష్ కూడా వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కాదనకుండా అందరితో సెల్ఫీలు దిగడంతో పాదయాత్ర చాలా మెల్లగా ముందుకు సాగింది. నిన్న సాయంత్రం జంగారెడ్డిగూడెం వద్ద బహిరంగసభ నిర్వహించారు. ఆ సభకు వేలాదిగా ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది.
ఆ సభలో నారా లోకేష్ సిఎం జగన్మోహన్ రెడ్డికి చురకలు వేస్తూ, “పని రానోడు పందిరి వేస్తే పిచ్చిక వాలితే పడిపోయిందట! ఏం చెపుతున్నానో అర్దమైందా రాజా… మూడు రాజధానులు కడతానన్నావు… మూడు ప్రాంతాలలో మూడు ఇటుకలు కూడా పెట్టలేకపోయావు. విశాఖలో రూ.40 లక్షలు ఖర్చు చేసి ఓ బస్టాండ్ కట్టాడు. దానికి పునాదులు లేవు… గట్టిగా గాలేస్తే బస్టాండ్ పడిపోయింది. దానిపై పెట్టుకొన్న జగన్ ఫోటో కూడా కింద పడిపోయింది. చంద్రబాబు నాయుడు స్టాండర్డ్ పోలవరం ప్రాజెక్టు అయితే జగన్ స్టాండర్డ్ ఇదే,” అంటూ ఎద్దేవా చేశారు.
అంతకు ముందు చింతలపూడి నియోజకవర్గం నిర్వహించిన మరో సభలో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ని నమ్మడం లేదని జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, “ముందు మీ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, మరో చెల్లి సునీతా రెడ్డి నిన్ను నమ్ముతున్నారా జగన్?చెప్పాలి. మీ సొంత కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరూ నిన్ను నమ్మడం లేదు. మరి మా కుటుంబం గురించి ఎలా మాట్లాడుతున్నావు జగన్?ఆనాడు మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు నిన్ను ఏపీలో అడుగుపెట్టడానికి వెళ్ళేదని వార్నింగ్ ఇచ్చిన మాట నిజమా కాదా జగన్?” అని నారా లోకేష్ ప్రశ్నించారు.



