ఆరు నెలల్లో జగన్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా!

Nara-Lokesh-challenge-Jaganమాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలు స్పందించడం లేదు. తమను కలిసేందుకు ఢిల్లీలో వేచి చూస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కానీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ ఇచ్చారు. నారా లోకేశ్‌ పార్టీ ఎంపీలతో కలిసి రాష్ట్రపతిని కలిసి చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఆంధ్రాలో వైసీపి అరాచకాలు, రాజకీయ వేధింపుల గురించి వివరించారు.

ADVERTISEMENT

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “మూడుసార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతో నిబద్దతతో, నిజాయితీతో పనిచేసిన చంద్రబాబు నాయుడుపై రాజకీయకక్ష సాధించేందుకే జగన్‌ ప్రభుత్వం ఆయనపై అక్రమకేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది.

జగన్‌ మాకు ఇచ్చిన ఈ గిఫ్ట్ కు ఆరు నెలల్లో తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. ఈ బాధ్యత నేనే తీసుకొంటాను. ప్రతిపక్ష నేతలను ప్రజల మద్యకు వెళ్ళకుండా అడ్డుకొనేందుకే జగన్‌ ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రలు ఫలించవు. మేము న్యాయపోరాటాలు చేసి ఈ అక్రమ కేసుల నుంచి బయటపడతాము. ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేసి జగన్‌ ప్రభుత్వాన్ని తప్పకుండా గద్దె దించుతాము.

“నేను కేసులకు భయపడి ఢిల్లీలో దాక్కొన్నానని వైసీపి దుష్ప్రచారం చేస్తోంది. ఒకవేళ నేను నిజంగానే అవినీతికి పాల్పడిన్నట్లు జగన్‌ ప్రభుత్వం భావిస్తున్నట్లయితే పోలీసులను ఢిల్లీకి పంపించి నన్ను అరెస్ట్ చేయించవచ్చు కదా… కానీ చేయలేదేమి?

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో ఏమైనా ఆధారాలు ఉంటే ఇమ్మనమని ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబు నాయుడుని అడగడం చూస్తే ఇవన్నీ తప్పుడు కేసులని స్పష్టమవుతోంది కదా?నేను, నా కుటుంబం, టిడిపి నేతలు ఎవరూ ఏ తప్పు చేయలేదు. ఎవరి దగ్గర నుంచి ఒక్క పైసా తీసుకోలేదు. కనుక ఈ తప్పుడు కేసులకు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు.

త్వరలోనే యువగళం పాదయాత్ర పునః ప్రారంభిస్తాను. ఇప్పటికే దాని కోసం అనుమతి కోరుతూ జిల్లా పోలీసులకు దరఖాస్తు చేసుకొన్నాము. అనుమతి లభించగానే పాదయాత్ర మళ్ళీ మొదలుపెడతాను,” అని నారా లోకేశ్‌ చెప్పారు. అంటే మీదే ఆలస్యం అని జగన్‌ ప్రభుత్వానికి చెపుతున్నట్లే!

ADVERTISEMENT
Latest Stories