మంగళగిరి నియోజకవర్గంలోని యెర్రబాలెంలో నిన్న సాయంత్రం ‘హలో లోకేష్’ పేరుతో టిడిపి యువనేత నారా లోకేష్ యువతతో ముఖాముఖీలో ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందని, తాము అధికారంలోకి రాగానే నిర్మాణ పనులు మొదలుపెట్టి యుద్ధ ప్రాతిపదికన మూడేళ్ళలో పూర్తిచేస్తామని విస్పష్టంగా మరోసారి చెప్పారు.
నిజానికి టిడిపి ప్రభుత్వమే అమరావతిని రాజధానిగా నిర్ణయించింది కనుక అది దానికి కట్టుబడి ఉండటం గొప్ప విషయమేమీ కాదు. అయితే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాయలసీమ, ఉత్తరాంద్ర ప్రజలను టిడిపికి వ్యతిరేకంగా రెచ్చగొడుతూ వచ్చే ఎన్నికలలో దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నప్పుడు కూడా టిడిపి అమరావతికే కట్టుబడి ఉండటమే గొప్ప విషయం.
అమరావతిని నిర్మిస్తామని చెపుతున్న టిడిపి కావాలో లేక ఓసారి మూడు రాజధానులు మరోసారి విశాఖ ఒక్కటే రాజధాని అని మభ్యపెడుతున్న వైసీపీ కావాలో ప్రజలనే తేల్చుకోమని నారా లోకేష్ రాష్ట్ర ప్రజలను కోరిన్నట్లు భావించవచ్చు.
గత నాలుగున్నరేళ్ళుగా సిఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిలోనే ఉంటూ అక్కడి నుంచే రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. కానీ అమరావతి రాజధానిగా పనికిరాదంటున్నారు! వరుసగా రెండు ప్రభుత్వాలు అమరావతి నుంచే రాష్ట్రాన్ని పాలించగలిగినప్పుడు ఆ ప్రాంతం రాజధానికి అన్ని విధాలా అనువుగా ఉందనే కదా అర్దం?
ఈ నాలుగున్నరేళ్ళ వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని సిఎం జగన్తో సహా అందరూ నమ్మబలుకుతున్నారు. వారి మాటలు నిజమనుకొంటే అమరావతి నుంచి పాలన చేసినా రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని వారే స్వయంగా ధృవీకరిస్తున్నట్లేగా?
రాష్ట్ర విభజన తర్వాత అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో కూడా చంద్రబాబు నాయుడు అమరావతిని నిర్మించగలిగారు. కానీ రాష్ట్ర ప్రజలు వైసీపీకి చాలా భారీ మెజార్టీతో అధికారం కట్టబెట్టినప్పటికీ, చంద్రబాబు నాయుడు విభజన అనంతరం ఏర్పడిన అన్ని సమస్యలను పరిష్కరించి వడ్డించిన విస్తరిలా రాష్ట్రాన్ని, అమరావతిని అందించినా, జగన్ ప్రభుత్వం 5 ఏళ్ళు అధికారంలో ఉండి అమరావతిని పూర్తి చేయలేదు. అది గొప్పగా చెప్పుకొన్న మూడు రాజధానులని ఏర్పాటు చేయలేకపోయింది. ఆ మూడు రాజధానుల ప్రతిపాదనకు కూయా అది కట్టుబడలేదు. విశాఖ ఒక్కటే రాజధాని అని చెప్పుకొన్నా అదీ చేయలేకపోయింది. కనీసం సిఎం జగన్ విశాఖకు తరలివచ్చేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారు!
ఈ నేపధ్యంలో వైసీపీ ఇప్పుడు మాట మార్చి అమరావతి రాజధాని అని చెప్పుకోలేదు. చెప్పినా ప్రజలు నమ్మబోరు. కనుక వచ్చే ఎన్నికలలో మూడు రాజధానులు లేదా విశాఖ రాజధాని స్టోరీయే ప్రజలకు మళ్ళీ చెప్పుకోవలసి ఉంటుంది. కానీ తమను మాటలను విశ్వసించలేమని ఆ పార్టీయే స్వయంగా నిరూపించుకొంది.
ఈ నేపధ్యంలో నారా లోకేష్ అమరావతే ఏపీకి రాజధాని అని చాలా లౌడ్ అండ్ క్లియర్గా చెప్పడం ఇంకా వైసీపీ మాయలో ఉన్న ప్రజలను కూడా దాని మాయలో నుంచి బయటకులాగి రాష్ట్ర ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు గట్టి ప్రయత్నమే చేసిన్నట్లు భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కోలుకొని పూర్వవైభవం సాధించాలనుకొంటే ఇంతకు మించి వేరే దారి లేదు కూడా.



