ప్రస్తుతం రాజోలు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ను కూడా ఈరోజు ఉదయం పోలీసులు నిర్బందించారు. ఈరోజు తెల్లవారుజామున మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని పోలీసులు నంద్యాలలో అరెస్ట్ చేసిన విషయం తెలుసుకొని ఆయనను చూసేందుకు బయలుదేరగా, పోలీసులు అడ్డుకొన్నారు. అక్కడికి వెళితే శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని, కనుక అనుమతించమని చెపుతూ ముందుకు కదలకుండా అడ్డుకొన్నారు. దీంతో నారా లోకేష్ అక్కడే రోడ్డుపై బైటాయించి నిరసన తెలుపుతున్నారు.
ఆయనను నిర్బందించి ఓ పోలీస్ అధికారి తమకు ఇంకా చాలా కేసులున్నాయంటూ ఏదో మాట్లాడబోయే, నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “వివేకానందరెడ్డిని హత్య చేసిన కేసులో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. కానీ ఆయన కొడుకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మీకు ధైర్యం ఉండదు. మాపై వైసీపీ కార్యకర్తలు రాళ్ళదాడి చేస్తే వాళ్ళని అడ్డుకోలేరు. కనీసం వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయలేరు. కానీ వారిపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన మా టిడిపి కార్యకర్తలని అరెస్ట్ చేస్తారు. రాళ్ళదాడిలో గాయపడిన మా యువగళం పాదయాత్ర వాలంటీర్లను అరెస్ట్ చేస్తారు.
మీ ప్రతాపం అంతా మాపైనే చూపుతుంటారు కానీ వైసీపీ నేతలు, కార్యకర్తలను ఏమీ చేయలేరు. నాపై జరిగిన రాళ్ళదాడిలో మీ పోలీసులు కూడా ఇద్దరు గాయపడ్డారు కదా? అయినా మీరు రాళ్ళ దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయగలిగారా? లేదు. కానీ ఇప్పుడు నేను నా తండ్రిని చూసేందుకు వెళుతుంటే వచ్చి అడ్డుకొంటున్నారు. ఓ కుటుంబ సభ్యుడిగా నా తండ్రిని చూసే హక్కు నాకుంది. మీరు నన్ను అడ్డుకోవడం సరికాదు. దయచేసి నన్ను వెళ్ళనీయండి,”అని నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.
కానీ ఆయనను చుట్టుముట్టిన పోలీసులు అక్కడి నుంచి కదలనీయడం లేదు. ఈరోజు ఉదయం 7.30 గంటల నుంచి నారా లోకేష్ రోడ్డుపై బైటాయించి పోలీసుల వైఖరికి నిరసన తెలుపుతున్నారు.



