ఏపీ ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం అమెరికా ప్రయాణం అవుతున్నారు. అమెరికా, లాస్ వెగాస్లో ఈ నెల 29 నుంచి సినర్జీ సదస్సు జరుగబోతోంది. ఆ సదస్సులో పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు సాధించుకు వచ్చేందుకు నారా లోకేష్ బయలుదేరుతున్నారు. అమెరికాలో వారం రోజులు పర్యటించనున్నారు.
ఈ సదస్సులో అమెరికాలోని ఐటి రంగానికి చెందిన మూడు వేల పెద్ద, మద్య తరహా, చిన్న కంపెనీల ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, స్టీవ్ ఫోర్బ్స్, కెవిన్ ఓ లియరీ, ఎఫ్డిఐసీకి చెందిన షిల బ్లేర్, ఓపెన్ ఏఐకి చెందిన జాక్ కాస్ తదితరులు ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు.
ఈ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణ కొరియా నుంచి ఓ బృందం వస్తోంది. వారిలో ది కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతినిధులు కూడా ఉన్నారు. ఆ బ్యాంక్ ఏపీలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దక్షిణ కొరియా బృందంతో నారా లోకేష్ సమావేశం కానున్నారు.
గత 5 ఏళ్ళుగా రాష్ట్రంలో అరాచక వాతావరణం నెలకొని ఉండేది. కనుక ఈ విదేశీ పర్యటనలో నారా లోకేష్ బృందం ప్రయత్నాలు ఫలించి, ఏపీకి ఐటి కంపెనీలు తరలివస్తే రాష్ట్రంలో మార్పు మొదలయిన్నట్లే భావించవచ్చు.




