నారా లోకేష్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టారు. యువగళం పాదయాత్రలో నేడు 200వ రోజున సీతంపేటలో 2,700 కిమీ పాదయాత్ర పూర్తిచేయనున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు ఇచ్చిన హామీలతో కూడిన శిలాఫలకాన్ని నారా లోకేష్ ఆవిష్కరించనున్నారు.
నారా లోకేష్ జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించారు. ఈ 200 రోజులలో 15 జిల్లాలలో 77 శాసనసభ నియోజకవర్గాల గుండా 2700 కిమీ పాదయాత్ర పూర్తిచేశారు. ఈ సుదీర్గ పాదయాత్రలో నారా లోకేష్ రాయలసీమలోనే 44 నియోజకవర్గాల గుండా ఏకధాటిగా 124 రోజులలో 1,587 కిమీ పాదయాత్ర చేశారు.
ఈ సుదీర్గ పాదయాత్రలో నారా లోకేష్ లక్షలాది మంది సామాన్య ప్రజలను, బడుగు బలహీనవర్గాల ప్రజలను, మైనార్టీ ప్రజలను, మహిళలను, రైతులను, విద్యార్థులు, నిరుద్యోగులు, న్యాయవాదులు ఇంకా అనేక వర్గాల ప్రజలను కలిసి వారితో ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యలను, అవసరాలను అడిగి తెలుసుకొన్నారు.
పాదయాత్రలో ఏదో మొక్కుబడిగా పలకరించి, మొక్కుబడిగా హామీలు ఇచ్చుకొంటూ వెళ్ళిపోకుండా ఎక్కడికక్కడ అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు. వారు చెప్పిన సమస్యలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకొంటూ, వారి సమస్యలను, అవసరాలను తీర్చేందుకు ఇచ్చిన హామీలను శిలాఫలకాలపై వ్రాయించి ఆవిష్కరిస్తున్నారు.
తద్వారా వాటికి తాను కట్టుబడి ఉంటానని నమ్మకం కల్పిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక ఒకవేళ ఆ హామీలను అమలుచేయకపోతే, ఆ శిలాఫలకాల సాక్షిగా తనను నిలదీసి అడగండని నారా లోకేష్ చెపుతున్నారు కూడా. మ్యానిఫెస్టోలో హామీలంటే ప్రజలు అడగలేకపోవచ్చు. కానీ తమ ఊర్లోనే వేసిన శిలాఫలకాలను చూపి నిలదీయగలరు. కనుక అవన్నీ పూర్తిచేయగలననే పూర్తి నమ్మకంతోనే నారా లోకేష్ ఈ హామీలు ఇస్తున్నట్లు భావించవచ్చు.
నారా లోకేష్ మొత్తం 400 రోజులలో 4,000 కిమీ పాదయాత్ర చేయబోతున్నారనే సంగతి తెలిసిందే. దానిలో 200 రోజులలో 2,710 కిమీ పాదయాత్ర పూర్తిచేశారు. ఈ 200 రోజులలో 64 బహిరంగసభలు, 132 ముఖాముఖీ సమావేశాలు, 8 రచ్చబండ, 10 ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
వీటిలో కడపలో నిర్వహించిన ‘హలో లోకేష్’, రాయలసీమ డిక్లరేషన్ సభలు చాలా ప్రత్యేకమైనవి. ప్రతీ జిల్లాలో నిర్వహించే ‘హలో లోకేష్’ కార్యక్రమంలో ఆ జిల్లాలో ప్రజలు నేరుగా లేదా ఫోన్ల ద్వారా అడిగే ప్రశ్నలకు నారా లోకేష్ సమాధానాలు చెపుతుంటారు. రాయలసీమ డిక్లరేషన్ ద్వారా టిడిపి అధికారంలోకి వస్తే సీమ జిల్లాల అభివృద్ధికి ఏమేమి చేస్తుందో నారా లోకేష్ వివరించారు. మూడు రాజధానులతో కాదు… మూడు ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరణ చేయడం ద్వారానే ప్రజల అవసరాలు తీరుతాయని నారా లోకేష్ చెప్పిన మాటకు సీమ జిల్లాల ప్రజలు ఆమోదం తెలిపారు. నారా లోకేష్ ఇప్పటి వరకు ప్రజల నుంచి 3,813 వినతులు స్వీకరించారు.



