మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయ్యి నాలుగు రోజులైంది. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన వెంటనే టిడిపి ఎంపీ కేశినేని నాని ప్రధాని నరేంద్రమోడీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వేర్వేరుగా లేఖలు వ్రాసి ఈ విషయం తెలియజేసారు. కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం తరపున ఎవరూ మాటమాత్రంగా కూడా స్పందించలేదంటే ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోదలచలేదని స్పష్టమవుతోంది.
అలాగే చంద్రబాబు నాయుడుపై వైసీపి ప్రభుత్వం కొత్త కేసులు వేస్తుండటం గమనిస్తే ఈ వ్యవహారంలో జగన్కు కేంద్రం ‘ఫ్రీ హ్యాండ్’ ఇచ్చిన్నట్లే భావించవచ్చు. కేంద్రం వైఖరిపై ఇప్పుడే ఓ అంచనాకు రావడం తొందరపాటే అవుతుంది కానీ దాని మౌనం తప్పుడు సంకేతాలు పంపిస్తోందని చెప్పక తప్పదు.
ఒకవేళ ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోదలచకపోతే టిడిపి కూడా బీజేపీ పట్ల మెతక వైఖరిని వీడి తమకు సంఘీభావం ప్రకటిస్తున్న ‘ఇండియా కూటమి’తో చేతులు కలపడం మంచిది. తద్వారా ఆ కూటమిలోని కాంగ్రెస్ పార్టీతో సహాయ 26 పార్టీల మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా ఏపీలో కాంగ్రెస్, వామపక్షాల మద్దతు టిడిపికి లభిస్తుంది.
ఒకవేళ లోక్సభ ఎన్నికలలో ఇండియా కూటమి మెజార్టీ సాధించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే, అప్పుడు టిడిపి కూడా కేంద్రంలో భాగస్వామి కాగలుగుతుంది. ముఖ్యంగా అప్పుడు ఇండియా కూటమిలోకి వైసీపి జొరబడకుండా టిడిపి అడ్డుకోగలుగుతుంది కూడా.
ముఖ్యంగా ‘ఇండియా కూటమి’తో టిడిపి చేతులు కలిపేందుకు సిద్దపడుతున్నట్లు తెలిస్తే అప్పుడు కేంద్రం వైఖరిలో కూడా మార్పు రావచ్చు. ప్రస్తుత పరిస్థితులలో టిడిపి తన ముందున్న ఇటువంటి అన్ని మార్గాలను ఉపయోగించుకోవడం చాలా అవసరం కూడా!



