బిజెపి హిందుత్వ అజెండాతో పనిచేస్తుంది కనుక దాని ఆలోచనలు, నిర్ణయాలు అన్నీ అందుకు అనుగుణంగానే ఉంటాయి. త్వరలో 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రతీ ఎన్నికలకు ముందు ఏదో ఓ అంశాన్ని హైలైట్ చేసి దాంతో హిందూ ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించే మోడీ ప్రభుత్వం, ఈసారి ఉమ్మడి పౌర స్మృతి బిల్లుని భుజానికెత్తుకుంది.
ఒకవేళ కేంద్రానికి అటువంటి దురుదేశ్యం లేదనుకొంటే, మొదటిసారి లేదా రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రతిపాదన చేసి ఉండొచ్చు. కానీ చేయలేదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడిన తర్వాత చేస్తోంది. అంటే ఎన్నికలలో లబ్ధి పొందేందుకే చేస్తోందని భావించాల్సి ఉంటుంది.
దేశంలో కోట్లాది మంది హిందువులు అనేక కులాలుగా, అనేక పార్టీల మద్య చీలిపోయి ఉన్నారు. కనుక వారందరినీ ఈ బిల్లుతో ఒకవైపు తీసుకురాగలిగితే వారి మద్దతుతో వచ్చే లోక్సభ ఎన్నికలలో బిజెపి అవలీలగా విజయం సాధించవచ్చని ఆలోచిస్తున్నట్లుంది.
దేశంలో నివసించే ప్రజలందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం ఉండాలనుకోవడం వినేందుకు బాగానే ఉంది. కానీ అనేక మతాలు, కులాలు, భాషలు, సంస్కృతులు, భిన్నమైన ఆచారాలు, సాంప్రదాయాలు పాటించే ప్రజలందరికీ ఒకటే సూత్రం ఎలా వర్తింపజేయగలరు?దీని వలన ఆయా వర్గాల ప్రజలకు ఎదురయ్యే సమస్యలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించగలదా?
కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా నోట్ల రద్దు చేసినప్పుడు, లాక్డౌన్ విధించినప్పుడు దేశంలో కోట్లాదిమంది ప్రజలు నానా కష్టాలు పడ్డారు. అనేకమంది తీవ్రంగా నష్టపోయారు. కొందరి జీవితాలు ఛిద్రం కాగా కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. కానీ వాటికి కేంద్రప్రభుత్వం బాధ్యత తీసుకోలేదు. కనుక రేపు ఈ బిల్లు పర్యవసనాలను కూడా ప్రజలే భరించాలి తప్ప కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోదని వేరే చెప్పక్కరలేదు.
అయితే ఈ బిల్లుతో బిజెపి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంటే, ఇదే బిల్లు కాంగ్రెస్ మిత్రపక్షాలను మరింత సంఘటిత పరుస్తుంది కూడా. దేశంలో ఇప్పుడిప్పుడే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకొంటోంది. దీనిపై కాంగ్రెస్ సరిగ్గా పోరాడగలిగితే దీంతో కాంగ్రెస్ కూడా మంచి రాజకీయ మైలేజీ లభిస్తుంది. లోక్సభ ఎన్నికలలో లబ్ధి పొందగలుగుతుంది.
ఈ బిల్లు దేశంలో బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీలను, శక్తులను, వివిద మతాల ప్రజలను కూడా ఏకం చేస్తుందని బిజెపికి తెలియదనుకోలేము. అయితే వారి శాతం కంటే దేశంలో హిందూ ఓటర్ల శాతమే ఎక్కువగా ఉంది కనుక ఈ బిల్లుతో వారిలో మెజార్టీ శాతాన్ని బిజెపివైపు తిప్పుకోగలిగితే చాలు ఎన్నికలలో సునాయాసంగా గెలిచి మళ్ళీ అధికారంలోకి రాగలమని బిజెపి వ్యూహంగా కనిపిస్తోంది.
కనుక ఈ బిల్లుతో బిజెపి రాజకీయ జూదం ఆడుతున్నట్లే భావించవచ్చు. కనుక ఈ రాజకీయ జూదంలో ఏ కూటమి గెలుస్తుందో తెలియాలంటే లోక్సభ ఎన్నికలు ముగిసేవరకు వేచి చూడాల్సిందే.



