తెలుగు ప్రజలదే నెంబర్ 1 స్థానం!

Narendra-Modi-Farmers Loan Waiverకేంద్రం చేతిలో భంగపాటుకు గురికావడం తెలుగు ప్రజానీకానికి అనాదిగా వస్తున్న ఆచారం. గతంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో ఎన్టీఆర్ దీనికి ‘ఆత్మగౌరవం’తో కాస్త బ్రేకులు వేసినా, ఆ తర్వాత కాలంలో షరామామూలైపోయింది. మరో మాటలో చెప్పాలంటే… దేశంలో అతి ఎక్కువ సార్లు కేంద్రం చేతిలో మోసపోయిన ప్రజలు ఎవరైనా ఉన్నారంటే… అందులో నెంబర్ 1 స్థానం తెలుగువారిదే అని చెప్పవచ్చు. తరాలు మారుతున్నా తెలుగు ప్రజల తలరాతలు మారకపోవడానికి కారణం ఇదే!

తాజాగా యూపీలో విజయభేరి మ్రోగించిన బిజెపి సర్కార్, ఎన్నికల హామీలలో ఇచ్చిన విధంగా రైతుల రుణమాఫీని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటన చేయడం మరోసారి తెలుగు వారి పట్ల ఢిల్లీ పెద్దల చిన్నచూపును బయట పెట్టింది. నాడు టిడిపితో కలిసి ఏపీ వ్యాప్తంగా స్వయంగా ప్రచారం నిర్వహించిన మోడీ, ‘మీకు కావాల్సిన అన్ని విషయాలను తానూ స్వయంగా చూసుకుంటానని, గుజరాత్ తర్వాత తన రాష్ట్రం ఏపీయేనని’ రకరకాల సినీ డైలాగ్ వేసి ప్రజలను నమ్మించారు.

ADVERTISEMENT

అసలే కష్టాల్లో ఉన్న ప్రజానీకానికి ఈ మాటలు కొండంత ధైర్యాన్నిచ్చాయి, అందుకు అనుగుణంగానే టిడిపి-బిజెపిలను అధికారంలోకి తెప్పించాయి. తీరా రైతు రుణమాఫీ దగ్గరకి వచ్చేపాటికి, ఇలాంటి వాటికి తానూ విరుద్ధం, ఆర్ధిక వ్యవస్థకు ఇది చేటు చేసే అంశమంటూ ఇటు చంద్రబాబుకు, అటు కేసీఆర్ కు ‘హ్యాండ్’ ఇచ్చారు. బహుశా ఇది నిజమేమోనని విద్యావంతులు కూడా భావించారు. తీరా యూపీ దగ్గరకు వచ్చేపాటికి… రాజకీయ లబ్ది ముందు ఆర్ధిక వ్యవస్థ చిన్నబోయినట్లుగా మారిపోయింది.

దీంతో తెలుగు ప్రజానీకం మోడీ సర్కార్ పై కన్నెర్ర చేస్తున్నారు. ఇప్పటికే ఏపీకి ఇవ్వాల్సిన ‘స్పెషల్ స్టేటస్’ విషయంలో మోసగించిన మోడీ సర్కార్ నిర్ణయంపై గుర్రుగా ఉన్నప్పటికీ, మరో ప్రత్యామ్నాయం లేక ‘ప్రత్యేక ప్యాకేజ్’ పట్ల సైలెంట్ గా ఉన్నారు. ఇలా ప్రతి విషయంలోనూ తెలుగు ప్రజలకు అన్యాయం చేస్తుంటే… చూస్తూ ఊరుకోవాలా? అన్న నినాదం తెరపైకి వస్తోంది. ‘జనసేన’ అధినేత లాంటి వాళ్ళయితే ‘ఉత్తరాది – దక్షిణాది’ మధ్య కేంద్రానికి ఈ వివక్ష ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories