పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామంటూ రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే… దీని వెనుక కూడా చాలా పెద్ద కార్యాచరణ, పక్కా ప్లానింగే ఉందంటున్నారు ఆర్ధిక నిపుణులు. నిజానికి మోడీ ప్రకటన చేసిన సమయానికి మించి, ఉత్తమమైన సమయం మరొకటి లేదంటూ కితాబిస్తున్నారు. పని గంటల్లో ఒక్క గంట అవకాశం ఇచ్చినా… కొన్ని కోట్ల రూపాయల నల్లధనాన్ని తెల్లగా మార్చే సత్తా ఇండియాలో ఉందని, అందుకే ప్రధాని చాలా వ్యూహాత్మకంగా ప్రకటించారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
సాధారణంగా అన్ని బ్యాంకుల్లో సాయంత్రం ఐదు గంటలకు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోతాయి. ఆ తర్వాత ఆయా బ్యాంకుల్లో 500, 1000 రూపాయల నోట్లు ఎన్నెన్ని ఉన్నాయో చెక్ లిస్ట్ ఆర్బీఐకి అందుతుంది. దీంతో మొత్తం క్యాష్ ఎంత ఉందనేది సమగ్రమైన సమాచారం ఆర్బీఐకు తెలిసిపోతుంది. ఈ మొత్తం సమాచారం అందే వరకు మోడీ ఆగారు. చివరి నిమిషంలో రాత్రికి రాత్రి పెద్ద మొత్తంలో కోట్లాది రూపాయలు చేతులు మారకుండా ఉండేందుకే ఇంత సమయం వరకు వేచిచూసారు.
పెద్ద నోట్లు రద్దు చేశారని తెలియగానే బడా బాబులు తమకు తెలిసిన బ్యాంకు మేనేజర్లను ఆశ్రయించి తమ వద్ద ఉన్న నల్ల డబ్బును రాత్రికి రాత్రే బ్యాంకులకు తరలించి వంద, యాభై నోట్లుగా మార్చుకునే సౌలభ్యం ఉంది. అదే జరిగితే దేశవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల నల్ల డబ్బు తెల్ల డబ్బుగా మారిపోయే ప్రమాదం ఉంది. దీని వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోతుంది. దీనిని నివారించేందుకే ఆ ప్రకటన కోసం రాత్రి సమయం వరకు ఆగినట్టు నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు నల్లడబ్బును తెల్లగా మార్చుకునేందుకు కొందరు బంగారంపై దృష్టి సారిస్తారు. షేర్ మార్కెట్లలోనూ పెట్టేందుకు ప్రయత్నిస్తారు. అందుకే అవి కూడా మూసేసిన తర్వాత మాత్రమే మోడీ ముహూర్తం పెట్టారు. మరో విషయం ఏమిటంటే… సట్టా బజార్పైనా రద్దు ప్రభావం పడింది. అమెరికా ఎన్నికలపై కోట్లాది రూపాయల బెట్టింగ్ జరిగింది. రాత్రి ఒంటిగంట తర్వాత ఫలితాలు రావడం ప్రారంభమయ్యాయి. అందుకే, రాత్రి 12 తర్వాత కరెన్సీకి విలువ లేకుండా చేశారు. ఇంత పక్కా ప్లానింగ్ తో చేయడంతో మోడీ సర్కార్ ఆలోచనలకు నిపుణులు ఫిదా అవుతూ సలాం చేస్తున్నారు.



