అధికారంలో ఉన్నవారు ఎన్ని తప్పులు, అక్రమాలకు పాల్పడినా వారిపై ఎటువంటి చర్యలు ఉండవు. కానీ ప్రతిపక్షాలు, వివిద రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను నడిపేవారు ఏ తప్పు చేయకపోయినా ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను దాడులు జరుగుతుంటాయని కనుక సీబీఐ దర్యాప్తుకి అన్ని రాష్ట్రాలు అనుమతి నిరాకరించాలని తెలంగాణ సిఎం కేసీఆర్ నిన్న పాట్నాలో మీడియా సమావేశంలో సూచించారు. బీహార్ సిఎం నితీశ్ కుమార్ కూడా ఇంచుమించు ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తం చేశారు.
సిఎం కేసీఆర్ కుమార్తె, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బయటపడటం, నితీశ్ కుమార్తో జత కట్టిన ఆర్జెడీ నేత తేజస్వీ యాదవ్పై ‘ఉద్యోగాలకు భూముల’ కుంభకోణంలో ఈడీ దర్యాప్తుకి సిద్దమవుతుండటం వారి ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. కారణాలుగా కూడా కనిపిస్తున్నాయి.
ప్రధాని నరేంద్రమోడీ నిన్న కేరళ రాష్ట్రంలో కొచ్చిలో మీడియాతో మాట్లాడుతూ, “మా ప్రభుత్వం అవినీతిపరులపై చర్యలు తీసుకొనేందుకు చర్యలు తీసుకొంటుంటే, జాతీయ రాజకీయాలలో కొన్ని ధృవాలు పుట్టుకొస్తున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు బహిరంగంగా ముందుకువచ్చి గ్రూపుగా ఏర్పడి అవినీతిపరులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి,” అని అన్నారు.
ఇక్కడ రెండు అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1. రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను లొంగదీసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఆదాయపన్నుశాఖలను దుర్వినియోగం చేస్తుండటం. 2. ప్రతిపక్షాలు లేదా ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు ఎన్ని అక్రమాలకు పాల్పడినా తమపై ఈడీ, సీబీఐ, ఆదాయపన్నుశాఖలు దర్యాప్తు చేయకూడదని ఆశిస్తున్నాయి. ఒకవేళ దర్యాప్తు చేస్తే అది రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తున్నాయి.
కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రెండూ నైతిక విలువలను మరిచి నీచ రాజకీయాలు చేసుకొంటున్నప్పుడు, అందుకు బాధపడి ప్రయోజనం ఏమిటి?అవి స్వయంకృతాపరాదాలే కనుక వాటికి అవే నేడు కాకపోతే రేపైనా మూల్యం చెల్లించక తప్పదు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా ఇందుకు మినహాయింపు కాదు. కేంద్రంలో ప్రభుత్వం మారితే రేపు దాని వంతూ రావచ్చు.



