జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు విదేయంగానే మెసులుకున్నారు. అందువల్లే 5 ఏళ్ళలో కేంద్రం ఆయన జోలికి రాలేదు.
ఇదే సమయంలో తెలంగాణలో కేసీఆర్ అండ్ కో నిత్యం ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై కత్తులు దూస్తుండేవారు.
ఇప్పుడు జగన్, కేసీఆర్ ఇద్దరూ అధికారం కోల్పోయారు. అన్ని విదాలా ఇంచుమించు ఒకే పరిస్థితిలో ఉన్నారు.
కానీ మోడీ, అమిత్ షాలపై కత్తులు దూసిన కేసీఆర్ ఇప్పుడు తన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావుల ద్వారా వారితో రాయబారాలు చేసుకోగలుగుతున్నారు. కూతురు కల్వకుంట్ల కవితని జైలు నుంచి ఇంకా చెప్పాలంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి విడిపించుకుని ఇంటికి తెచ్చుకున్నారు.
ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను జైలుకి పంపేందుకు రేవంత్ రెడ్డి వరుసపెట్టి అనేక కేసులు లైన్లో పెడుతున్నారు. వాటిలో ఏదో ఓ కేసులో ముగ్గురూ జైలుకి వెళ్ళక తప్పదని చెపుతున్నారు. తాము సిద్దమే అని కేటీఆర్ కూడా చెపుతున్నారు.
మోడీ, అమిత్ షాల సాయంతోనే వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారాని రేవంత్ రెడ్డి, మంత్రులు ఆరోపిస్తున్నారు.
అంటే నాడు కత్తులు దూసిన మోడీ, అమిత్ షాలతో కేసీఆర్ మళ్ళీ టచ్లోకి వెళ్ళి వారిని అవసరమైనప్పుడు ఉపయోగించుకోగలుగుతున్నారన్న మాట!
కానీ వారిపట్ల ఎంతో విధేయంగా మెసులుకున్న జగన్ ఇప్పుడు వారిని కలిసి మాట్లాడేందుకు కూడా వీల్లేకుండా పోయింది.
ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తుకి చంద్రబాబు నాయుడు సిద్దమైనప్పుడు చాలా మంది ఆయన నిర్ణయాన్ని తప్పు పట్టారు. కానీ అందరి కంటే ముందు ప్రమాదం పసిగట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే. బీజేపీ, టిడిపిలు పొత్తు పెట్టుకుంటే ఏవిదంగా లబ్ధి కలుగుతుందో చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు.
ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డికి అంతా కంటే బాగా తెలుసు. అందుకే అప్పుడు అడ్డుకునేందుకు విఫలయత్నాలు చేశారు. ఆ తర్వాత కధ అందరికీ తెలుసు.
కానీ నాడు చంద్రబాబు నాయుడు తీసుకున్న ఆ నిర్ణయం వలననే నేడు జగన్కి మోడీ, అమిత్ షాల అందండలు, కనీసం వారిని కలిసేందుకు కూడా అవకాశం లభించడం లేదని స్పష్టమవుతోంది.
ఆనాడే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ ఇదంతా ఊహించగలిగారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ఫలించాయి. జగన్వి ఫలించలేదు. అంతే!
అందుకే జగన్కు ఢిల్లీ తలుపులు మూసుకుపోయాయి. కానీ నేటికీ కేసీఆర్ మాత్రం అవసరమైనప్పుడు ఆ తలుపులు తెరిపించుకొని కొడుకుని, మేనల్లుడిని లోనికి పంపిచి పనులు చక్కబెట్టించుకోగలుగుతున్నారు. పాపం జగన్!




