మోడీజీ ఓ 89 వేల కోట్లు ఇవ్వరూ ప్లీజ్!

narendra modi ys jaganఅవును అక్షరాల 89,673 కోట్లే ఇవ్వాలని సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీ భీమవరం వచ్చినప్పుడు అడిగారు. రీసోర్స్ గ్యాప్ గ్రాంట్‌లో భాగంగా రూ.34,125 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఆ చేత్తోనే పోలవరం ప్రాజెక్టుకి సంబందించి సవరించిన (పెంచిన) అంచనాల ప్రకారం రూ.55,548 కోట్లకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. పనిలో పనిగా తెలంగాణ డిస్కంలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెల్లించవలసిన రూ.6,627 కోట్ల బకాయిలను కూడా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.

అయితే అన్నివేల కోట్లు కేంద్రప్రభుత్వం ఏనాడూ ఏ రాష్ట్రానికి ఒకేసారి ఇచ్చింది లేదు. ఇవ్వలేదు కూడా. కనుక గట్టిగా ఒత్తిడి చేస్తే వాటిలో ఓ 3-4, 000 కోట్లు విదిలిస్తుంటుంది. ఇప్పుడు ఏడాదికి రూ.8-10 కోట్లు అదనపు ఆదాయం కోసమే అమరావతిలో గ్రూప్-4 ఉద్యోగుల కోసం కట్టిన అపార్ట్‌మెంట్‌లను అద్దెకిచ్చేందుకు సిద్దపడుతున్న జగన్ సర్కార్‌, కేంద్రప్రభుత్వం 3-4, 000 కోట్లు విదిలించినా సంతోషిస్తుందని వేరే చెప్పక్కర లేదు.

ADVERTISEMENT

ఒకవేళ ఆ మాత్రం ఇచ్చినా అది ఏట్లో చింతపండు పిసికినట్లు అది ఏ సంక్షేమ పధకాలకో, ప్రభుత్వ నిర్వహణ ఖర్చులకో సరిపోతుంది. మళ్ళీ నెల తిరిగేసరికి ఇదే పరిస్థితని ప్రధాని నరేంద్రమోడీకి కూడా తెలుసు.

రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపది ముర్ముకి వైసీపీ బేషరతుగా మద్దతు ఇస్తున్నప్పటికీ, ప్రత్యేకహోదా అడిగేందుకు సిఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డిలకి ధైర్యం లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. బహుశః వాటి సంతృప్తి కోసమే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని సిఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేసినట్లు భావించవచ్చు.

అయితే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా కేంద్రానికి, రాష్ట్ర బిజెపికి కొత్తగా వచ్చే లాభం, నష్టం ఏమీ లేదని, ఇవ్వకపోయినా ఎవరి సమస్యలు వారికున్నాయి కనుక ఎవరూ ఏమీ పీకలేరని కేంద్రప్రభుత్వానికి తెలుసు. అందుకే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తమ ప్రభుత్వం గురించి, పార్టీ గురించి ఏమనుకొంటారో అనే వెరుపే లేకుండా ప్రత్యేకహోదా ఇచ్చే ప్రసక్తే లేదని పార్లమెంటులోనే కేంద్రమంత్రులు బల్లగుద్ది మరీ చెపుతున్నారు.

కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇస్తున్నా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఏమీ సాధించుకోలేకపోతున్నందుకు జగన్ సర్కారును నిందించాలా లేక రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకొంటూ కూర్చోన్నట్లు కలుగజేసుకోకుండా, ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి నానాటికీ దిగజారుతున్నప్పటికీ జోక్యం చేసుకోకుండా సినిమా చూసినట్లు చూస్తున్న కేంద్రప్రభుత్వాన్ని నిందించాలా?

ADVERTISEMENT
Latest Stories