కార్గిల్ వార్‌లో గెలిచాం… ఇప్పుడు ట్రేడ్ వార్‌లో గెలవాలంటే!

Modi Trump Trade War

వీధిలోనే కూరగాయల దుకాణం ఉన్నా ప్రజలు కాస్త దూరంలో ఉన్న రైతుబజారుకి వెళ్ళి కూరలు తెచ్చుకుంటారు. ఎందుకు అంటే తక్కువ ధరకు లభిస్తాయని.

అలాగే భారత్‌ కూడా రష్యా నుంచి తక్కువ ధరకు లభిస్తున్న చమురు కొనుగోలు చేస్తోంది. భారత్‌ అవసరాలు, ఆర్ధిక పరిమితులు తదితర అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న ఈ నిర్ణయం, ట్రంప్‌ దొరకి కోపం కలిగిస్తోంది. కనుక భారత్‌పై 25శాతం సుంకాలతో పాటు ‘జరిమానా’ కూడా విధించారు.

ADVERTISEMENT

దీనిపై భారత్‌ మృదువుగానే స్పందించినా “మా దేశ అవసరాలు, ప్రయోజనాలే మాకు ముఖ్యమని” తేల్చి చెప్పింది. అంటే ట్రంప్‌ ఏవిదంగా ‘అమెరికా ఫస్ట్’ అంటున్నారో అదేవిదంగా ప్రధాని మోడీ కూడా ‘ఇండియా ఫస్ట్’ అని చెపుతున్నారన్న మాట! ట్రంప్‌ విధానం తప్పు కానప్పుడు ప్రధాని మోడీ విధానం ఎలా తప్పు అవుతుంది?

భారత్‌ పట్ల ట్రంప్‌ కటువుగా వ్యవహరించడంతో “ఈ నెల నుంచి మొదలయ్యే పండుగలు, పెళ్ళిళ్ళ సీజనులో భారతీయులు అందరూ స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని” ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

భారత్‌లో అమెరికా వస్తువులు, ఉత్పత్తులు అంతంత మాత్రమే. కనుక దీని వలన అమెరికాకు ఎటువంటి నష్టమూ ఉండదు. మరి ప్రధాని మోడీ ఇలా ఎందుకు పిలుపునిచ్చారు?

అంటే ట్రంప్‌ నిర్ణయం వలన నష్టపోతున్న వ్యవసాయ, సాంకేతిక, వైద్య, ఎలక్ట్రానిక్ తదితర రంగాలలోని భారతీయ పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయి. కనుక వాటి ఉత్పత్తులను భారతీయులే కొనుగోలు చేసి వాటిని కాపాడుగోలిగితే వాటిపై ట్రంప్‌ ‘సుంకాల ప్రభావం’ లేకుండా చేయవచ్చు.

తద్వారా ట్రంప్‌ ఆశించిన ఫలితం లభించకపోగా, అమెరికాకు భారతీయ ఉత్పత్తులు ఎగుమతులు తగ్గితే అమెరికాయే ఎక్కువ నష్టపోతుంది.

స్వతహాగా వ్యాపరస్తుడైన ట్రంప్‌కు బహుశః మోడీ ‘స్వదేశీ పిలుపు’ అంతర్యం బాగానే పసిగట్టినట్లున్నారు. కానీ అది బయటకు చెప్పలేరు. కనుక రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం మానుకోకపోతే భారత్‌పై ఇంకా పన్నులు పెంచుతానంటూ మళ్ళీ హెచ్చరించారు.

కానీ రష్యాతో యుద్ధం చేయడానికి ఉక్రెయిన్‌కి ఆయుధాలు అందిస్తామని ట్రంప్‌ చెపుతున్నప్పుడు, రష్యా నుంచి భారత్‌ అవసరాల కోసం చమురు కొనుగోలు చేయడం తప్పేలా అవుతుంది?

ట్రంప్‌ 25 శాతం పన్నులు పెంచితేనే ఇక అమెరికాతో వ్యాపారం చేయలేమని పలువురు భారతీయ వ్యాపారవేత్తలు అనుకుంటున్నారు. ఇంకా పన్నులు పెంచితే పూర్తిగా మానుకోక తప్పదు. ఎందుకంటే ఎవరూ నష్టపోతూ వ్యాపారాలు చేయరు కదా? కానీ అమెరికాతో వ్యాపారాలు తగ్గించుకున్నా వారికీ, భారత్‌కు భారీగా నష్టం తప్పదు.

దీనికి ప్రత్యామ్నాయమే 145 కోట్ల జనాభా కలిగిన అతి పెద్ద స్వదేశీ మార్కెట్ అని ప్రధాని మోడీ సూచిస్తున్నారు.

ట్రంప్‌ భారత్‌పై ప్రకటించిన ఈ ‘ట్రేడ్ వార్’లో భారత్‌ విజయం సాధించాలంటే అందుకు భారతీయుల తోడ్పాటు చాలా అవసరం. మన పరిశ్రమలను మనం కాపాడుకోగలిగితే చాలు. అప్పుడు ఆలోచించుకోవలసింది భారత్‌ కాదు… డోనాల్డ్ ట్రంపే!

ADVERTISEMENT
Latest Stories