అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీ పదవికి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ దానికి గల కారణాలను మీడియా ముఖంగా వివరించారు. మాజీ ప్రధాని వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో తనను బీజేపీ రాజకీయాల్లోకి ఆహ్వానించగా, ఆయన కోరిక మేరకు తాను పార్టీలోకి వస్తే, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ తనను నిలువునా ముంచారని సంచలన వ్యాఖ్యలు చేసారు.
‘తన దృష్టిలో పంజాబ్ కన్నా పార్టీ పదవులు, హోదాలు ముఖ్యం కాదని, తనను పంజాబ్ కు దూరం చేయాలని బీజేపీ పెద్దలు ప్రయత్నించారని, వారి వైఖరికి తానెంతో మనస్తాపానికి గురయ్యానని తన ఆవేదనను వ్యక్తపరిచారు. సొంత రాష్ట్రానికి సేవ చేయాలన్న ఆశ తప్ప, తనకు పదవులపై ఆశ లేదని, తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను వదలి ఉండలేకనే పదవికి కూడా రాజీనామా చేశానని, తన మూలాలను తన నుంచి దూరం చేసే పనికి వ్యతిరేకంగానే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని’ అన్నారు.
తాను ఇప్పటివరకూ నాలుగు సార్లు ఎన్నికల్లో విజయం సాధించానని గుర్తు చేసిన సిద్ధూ, కేవలం సెలబ్రిటీ అయినందునే గెలుస్తున్నట్టు ప్రత్యర్థులు చేసిన ఆరోపణలను ఖండించారు. సెలబ్రిటీ అయితే, ఒక్కసారి మాత్రమే గెలుస్తారని, ఆపై చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి మాత్రమే ప్రజలు ఓట్లు వేస్తారని, 2004లో మరో 14 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయన్న వేళ తాను బీజేపీలో చేరిన సందర్భంలో ఉత్తర భారతావనిలో తానొక్కడినే బీజేపీ నుంచి విజయం సాధించానని అన్నారు.
ఇలా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కారణాలను వివరించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ, తన రాజకీయ భవిష్యత్తుపై మాత్రం నోరు విప్పలేదు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరికకు సంబంధించిన సస్పెన్స్ మరికొంత కాలం కొనసాగే అవకాశం కనపడుతోంది. ప్రస్తుత తరుణంలో తన రాజకీయ భవిష్యత్తు గురించి ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని మాత్రమే సిద్ధూ తెలిపారు. ఇదిలా ఉండగా, సిద్ధూ మీడియా సమావేశం అనంతరం ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్… ‘సిద్ధూ పంజాబ్ వెళితే, అక్కడ కొనసాగుతున్న మాదక ద్రవ్యాల సామ్రాజ్యంపై స్పందిస్తారు. వారిని సిద్ధూ బారిన పడకుండా బీజేపీ రక్షించాలని చూస్తోంది. ఇదో షాకింగ్’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు.



