‘సర్జికల్ స్ట్రైక్స్’ చేయక ముందు ఇండియా పెట్టుకున్న ప్రధాన లక్ష్యం… పాకిస్తాన్ ను ప్రపంచ దేశాలలో ఒంటరి చేయడం. అయితే దానిని విజయవంతంగా పూర్తి చేసినట్లుగా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. యూరీ సెక్టార్ పై ఉగ్రదాడికి పాల్పడిన వెంటనే రంగంలో దిగిన ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్తాన్ లో జరగాల్సి ఉన్న ‘సార్క్ సదస్సు’కు హాజరయ్యేది లేదని తేల్చిచెప్పారు.
ఆ వెంటనే భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలు తాము కూడా భారత్ వెంటే ఉన్నామని, పాకిస్థాన్ తక్షణం ఉగ్రవాద అనుకూల చర్యలు మానుకోవాలని, ఉగ్రవాదాన్ని అరికట్టే దిశగా కదలాలని సూచిస్తూ సార్క్ సదస్సుకు రామని తేల్చిచెప్పాయి. తాజాగా శ్రీలంక, మాల్దీవులు కూడా భారత్ వెంటే ఉన్నామన్న సంకేతాలు ఇస్తూ, సార్క్ సదస్సుకు రాలేమని పాకిస్తాన్ కు తెలిపాయి.
గత కొంతకాలంగా చైనాకు మద్దతు పలుకుతున్న శ్రీలంక కూడా సార్క్ సమావేశాలకు రామని చెప్పడంతో తీవ్ర ఆలోచనలో పడిన పాకిస్థాన్ సార్క్ సమావేశాలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సదస్సు ఎప్పుడు నిర్వహించాలనేది త్వరలో వెల్లడించనున్నామని పాక్ అధికారులు ప్రకటించారు. వాస్తవానికి, ఇస్లామాబాద్ లో నవంబర్ 9, 10వ తేదీల్లో 19వ సార్క్ శిఖరాగ్ర సదస్సు జరగాల్సి ఉంది. తాజా పరిణామాలతో పాకిస్తాన్ ఒంటరి కావడంతో, ఇండియా కొట్టిన దెబ్బకు పాక్ కు ‘70ఎంఎం’లో బొమ్మలు కనపడుతుండడం విశేషం.



