ఘనంగా వేడుకలు జరుపుకొని నూతన సంవత్సరాన్ని ఆహ్వానించాము… వచ్చేసింది కూడా. ఈ కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని అందరూ కోరుకుంటారు. ఆలయాలు, మసీదులు, చర్చిలకు వెళ్ళి ప్రార్ధిస్తారు. కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభించాలని పూజారులు, మత పెద్దలు కూడా ఆశీర్వదిస్తారు.
వారి ఆశీర్వాదాలు ఫలించాలంటే కాస్త మానవ ప్రయత్నం కూడా అవసరం. అదీ… సరైన దిశలో! అప్పుడే దేవుడు కరుణించి, అదృష్టం కూడా కలిసి వస్తే కొత్త సంవత్సరంలో మనం కోరుకున్నట్లుగా అంతా మంచే జరుగుతుంది.
కొత్త ఏడాదిలో చేయాల్సినవి, సాధించాల్సినవి, నేర్చుకోవాల్సినవి, వదిలించుకోవాల్సినవి… ఇలా చాలా పెద్ద జాబితాలే ఉంటాయి. కనుక ఓ వారం పది రోజుల తర్వాత మళ్ళీ రోటీన్లో పడి ఈ జాబితాలను పక్కన పడేయకుండా, ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ అవి పూర్తిచేయాలి.
ఒకవేళ చేయలేకపోయినా చేసేందుకు గట్టి ప్రయత్నాలైనా చేయాలి. లేకుంటే న్యూయర్ మరో ఇయర్గా వెళ్ళిపోతుంది తప్ప ఇయర్లో హ్యాపీ ఉండదు. రాదు.
ప్రభుత్వం మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ మంచిరోజులు వచ్చినట్లే ఉన్నాయి. వచ్చినట్లే… అని ఎందుకనాల్సి వస్తోందంటే, కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అవన్నీ వివిధ దశలలో ఉన్నాయి.
ఇదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. కనుక రెండు ప్రభుత్వాలు ఇంతే చిత్తశుద్ధి, నిబద్దత, పట్టుదలతో మొదలుపెట్టిన పనులన్నీ పూర్తి చేసినప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకి, ప్రజలకు అసలైన మంచి రోజులు మొదలవుతాయి.
ప్రభుత్వాల పనితీరు బాగుంటే ప్రజలు సుఖంగా జీవించగలుగుతారు. కనుక కొత్త సంవత్సరం బాగుండాలంటే మన ప్రయత్నాలతో పాటు ప్రభుత్వాల ప్రయత్నాలు కూడా బాగుండాలి. నిబద్దతతో పని చేయాలి.
రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిపక్ష నేతలు కూడా కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించడం చాలా అవసరం. ఈ ప్రభుత్వాలకు పాలన చాత గాదని, తాము తప్ప మరెవరూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరని, ప్రజలకు మరెవరూ మేలు చేయరని వితండవాదం చేస్తుంటాయి.
ఒకవేళ అవి రాష్ట్రాభివృద్ధి జరగాలని, ప్రజలకు మేలు కలగాలని నిజంగా తాపత్రయపడుతున్నట్లయితే, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుతగులుతూ అభివృద్ధికి ఆటంకం కలిగించకూడదు కదా?
కనుక సమాజంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా, క్రమశిక్షణతో వ్యవహరిస్తేనే న్యూ ఇయర్ హ్యాపీగా మారి సాగుతుంది. లేకుంటే జస్ట్ మరో ఇయర్ అంతే!







