ఏపీ మద్యం కుంభకోణంపై చర్యలు తీసుకోలేని నిసహాయత.. దౌర్భాగ్యమే!

No Actions Has Been Taken on Andhra Pradesh Liquor Scam

నేరాలలో క్రిమినల్ కేసులను ఏదో రకంగా పరిష్కరించవచ్చు. కానీ సంక్లిష్టమైన ఆర్ధిక నేరాలను లొసుగులతో కూడిన చట్టాలతో పరిష్కరించడం ఆసాధ్యమని జగన్‌-విజయసాయి అక్రమాస్తుల కేసులతో నిరూపించి చూపుతూనే ఉన్నారు.

అటువంటి ఆర్ధిక నేరాలు చేయగల నేర్పున్నవారి చేతికి అధికారం కూడా లభిస్తే, మరెంత పకడ్బందీగా నేరాలు చేయవచ్చో జగన్‌ హయంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం మరో నిదర్శనమని వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీ ఎంపీగా ఎన్నికైన లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటులో చెప్పారు.

ADVERTISEMENT

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశమంతటా సామాన్య ప్రజలు సైతం నగదు రహితలావాదేవీలు చేస్తుంటే, జగన్‌ ప్రభుత్వం మాత్రం మద్యం విక్రయాలలో నగదు అమ్మకాలే కొనసాగించిందని, ఆ విదంగా లెక్కకు దొరకని సొమ్మే రూ.690 కోట్లు అని చెప్పారు.

దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధం అమలుచేస్తామని హామీతో అధికారంలోకి వచ్చిన జగన్‌, గత 5 ఏళ్ళలో రూ.99,000 కోట్ల మద్యం వ్యాపారం చేయించారని, దానిలో రూ.18,000 కోట్లు దేశం దాటిపోయిందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటులో కుండబద్దలు కొట్టారు.

మద్య నిషేధం అమలుచేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌ రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి, అమ్మకాలు, కలెక్షన్స్‌ అన్నిటినీ తన కనుసన్నలలో నడిపిస్తూ 200 శాతం మద్యం వ్యాపారం చేశారని, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు.

జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్రంలో కొత్తగా 26 మద్యం కంపెనీలు పుట్టుకొచ్చాయని అవన్నీ ఆయన సన్నిహితులు, వైసీపీ నేతలకు చెందినవేనని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.

ఏపీలో జరిగిన ఈ కుంభకోణంతో పోలిస్తే రూ.300-400 కోట్ల ఢిల్లీ మద్యం కుంభకోణం సముద్రంలో నీటి బిందువు వంటిదని అన్నారు. ఆ నీటి బిందువుని ఒడిసిపట్టడానికి సీబీఐ, ఈడీలు ప్రయత్నిస్తున్నప్పుడు మహాసముద్రంలా విస్తరించిన ఏపీ మద్యం కుంభకోణంపై విచారణ జరపాలి కదా?అని ప్రశ్నించారు.

ఓ ప్రభుత్వమే ఈవిదంగా ఓ వ్యవస్థీకృత నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి, చట్టానికి పట్టుబడకుండా ఇంతగా అవినీతికి పాల్పడటం చూస్తున్నప్పుడు, అసలు ఇలాంటి నేరాలు జరుగకుండా అడ్డుకునే రాజ్యాంగ వ్యవస్థలు, యంత్రాంగం ఏం చేస్తోంది?అనే సందేహం ప్రజలకు కలుగుతుంది.

అధికారంలో ఉన్న ఆర్ధికనేరగాళ్ళని కట్టడి చేసే శక్తి సామర్ధ్యాలు మన వ్యవస్థలకు లేవనుకున్నా, కనీసం అటువంటివారు అధికారంలో లేనప్పుడైనా వారిపై చర్యలు తీసుకోలేని నిసహాయస్థితిలో మన వ్యవస్థలు ఉన్నాయా?

ఈ భారీ కుంభకోణం గురించి ఓ ఎంపీ పార్లమెంటులో చెప్పిన తర్వాత కూడా కేంద్రం చర్యలు తీసుకోలేకపోతే ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు.

ADVERTISEMENT
Latest Stories