ఒకప్పుడు సినీ రంగంలో ఒక దర్శకుడిగా ఎదగడానికి, నిలదొక్కుకోవడానికి, వారికంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకోవడానికి ఎన్నో ఏళ్ళ శ్రమ, కఠోరమైన కృషి తోడైతే గానీ ఇండస్ట్రీ లో ఆ దర్శకుడికి ఒక గుర్తింపు వచ్చేది కాదు.
కానీ, నేటి తరం దర్శకులకు ఈ క్రెజ్ ఒకే ఒక్క సినిమాతో దక్కుతుంది. ప్రేక్షకులను కట్టిపడేసే సరైన కథ, కథనం తో కూడిన ఒక్క సినిమాను ధియేటర్లలలో మెప్పించగలిగితే చాలు ఇక ఆ దర్శకుడిని ఆకాశానికెత్తడానికి, నెత్తిన పెట్టుకోవడానికి ఇప్పుడు పాన్ ఇండియా ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు.
ఇప్పుడు అటువంటి కొంతంది దర్శకుల గురించి క్లుప్తంగా…ఇందులో ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉంటూ ఈ ట్రెండ్ కు టార్చ్ బేరర్ గా నిలబడిన మనందరి జక్కన్న తెలుగు సినిమా పెద్దన్న SS రాజమౌళి. మగధీర,యమదొంగ,ఈగ వంటి చిత్రాలతో తెలుగులో ఇండస్ట్రీ హిట్లు అందుకున్న జక్కన్న”బాహుబలి” తో తెలుగు ఇండస్ట్రీ ని ప్రపంచానికి పరిచయం చేశారు.
ఇక ఆ తరువాత వచ్చిన బాహుబలి-2 ,ఆర్.ఆర్.ఆర్ తో ‘రామ్ చరణ్,ఎన్.టీ.ఆర్’ ను గ్లోబల్ స్టార్స్ గా మార్చి, ఆస్కార్ అవార్డును టాలీవుడ్ కు తీసుకువచ్చి ఇది రాజమౌళి సినిమా రా అనే బ్రాండ్ వాల్యూ ను ప్రపంచ వ్యాప్తంగా సంపాధించుకున్నారు రాజమౌళి.
ఇక, అప్పటివరకు 100 కోట్లు కలెక్షన్లు అనే పదం వినటమే కానీ, ఎప్పుడూ చూడని ‘కన్నడ ఇండస్ట్రీ’ తన రాక కోసమే వేచి ఉందా అన్నట్లుగా కెజిఫ్ తో తెర వెనుక ఉండే “ప్రశాంత్ నీల్” ట్రేండింగ్ లోకి వచ్చి శాండిల్ వుడ్ కు ట్రెండ్ సెటర్ అయ్యారు. యాంటీ హీరో ఎలిమెంట్, భారీ వైలెన్స్ తో కూడా వసూళ్ల రికార్డులను బద్దలుకొట్టొచ్చని నిరూపించిన మొట్టమొదటి ఈ తరం దర్శకుడు ప్రశాంత్ నీల్.
ఇక ఈ కోవలోకే చేరుకున్న మరో పాన్ ఇండియా అగ్ర దర్శకుడు నాగ అశ్విన్. “కల్కి- 2898 ఏ.డీ” అంటూ భారత చలన చిత్ర పరిశ్రమ లో ఎప్పుడూ ఎవరు సాహసించని ఒక కొత్త జోనర్ తో ఏకంగా “1000 కోట్లు” కలెక్షన్లు కొల్లగొట్టి ప్రపంచానికి తెలుగు సినిమా సత్తాను చూపించారు. భారత పురాణ ఇతిహాసాలను ఆదర్శంగా తీసుకుని, ఆయన ఒక సరికొత్త ప్రపంచాన్నే సృష్టించి ప్రేక్షకుల మెప్పు పొందారు.
ఇక, 2017 లో తెలుగు యువత ను ఒక ఊపు ఊపేసిన చిత్రం “అర్జున్ రెడ్డి”. ఈ సినిమాతో ఎన్నో విమర్శలను, వివాదాలను ఎదుర్కొని కూడా భారీ విజయాన్ని అందుకున్నారు సందీప్ వంగా. దర్శకుడిగా తన మొదటి సినిమాతోనే తన బ్రాండ్ ఇది అంటూ బోల్డ్ కంటెంట్ మూవీ తో ముందుకొచ్చి కూడా క్రెజి దర్శకుడిగా నిలబడి యానిమల్ మూవీ విజయంతో మరోస్థాయికి చేరుకున్నారు వంగా.
అలాగే, 2018 లో రంగస్థలం అంటూ రామ్ చరణ్ తో నాన్ బాహుబలి హిట్ అందుకున్న దర్శకుడు సుకుమార్. 2022 పుష్పతో సుక్కు అంటే తెలుగు దర్శకుడు కాదు పాన్ ఇండియా డైరెక్టర్ ఇక తగ్గేదేలే అన్నట్లు ఈ రేసులోకి దూసుకొచ్చారు సుకుమార్. ఇక డిసెంబర్ 5 న రాబోతున్న పుష్ప – 2 కోసం ఏవత్ భారతీయ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఇక చివరిగా చెప్పుకోవాల్సిన మరో దర్శకుడు లోకేష్ కనకరాజు. కొలీవుడ్ దర్శకుడిగా ఉన్న లోకేష్, కార్తీ తో తెరకెక్కించిన “ఖైదీ” తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నప్పటికీ కమలహాసన్ తో తీసిన “విక్రమ్” అతనికి పాన్ ఇండియా క్రెజ్ ను తెచ్చిపెట్టింది. అప్పటి వరకు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న సీనియర్ హీరో కమలహాసన్ కు అతని కెరీర్ బెస్ట్ హిట్ అందించారు లోకేష్.
ఇలా వీరు తనతో పాటు గా తన సినిమాల హీరోలకు కూడా కెరీర్ బెస్ట్ ఫిలిమ్స్ ఇచ్చి ట్రేండింగ్ డైరెక్టర్లుగా ఇండస్ట్రీలో పేరు దక్కించుకుని, తమతమ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్లు ఇవ్వడమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా తమ సినిమాను నిలబెట్టి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభజనమే సృష్టించారు.
అయితే వీరి కీర్తి కిరీటానికి ఇక్కడితో శుభం కార్డు వెయ్యలేము, ఎందుకంటే పాన్ ఇండియా స్థాయి విజయాన్ని అందుకున్న సినిమాలకు పార్ట్ -2 అంటూ తెరముందుకొచ్చి వాటిలోనూ అదే స్థాయి విజయాన్ని అందుకున్నారు. అందుకే వీరు “ట్రేండింగ్ డైరెక్టర్లే కాదు ట్రెండ్ సెట్ చేసిన దర్శకులు”గా తమ పేరిట కొత్త చరిత్రలు సృష్టించుకుంటూ సౌత్ సినిమా స్థాయిని పెంచుతున్నారు.




