రాష్ట్ర ప్రజలతో పాటు యావత్తు దేశమంతా ఆసక్తిని పెంచిన తమిళనాడు రాజకీయాల్లో ఓ కీలక ఘట్టం ముగిసింది. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న గవర్నర్ విద్యాసాగరరావు చెన్నై రావడం, ముందుగా పన్నీర్ సెల్వంకు అవకాశం ఇవ్వడంతో, ఏం జరుగుతుందా? అని ఎదురుచూసిన వారికి పన్నీర్ భేటీ వివరాలను తెలిపారు. 15 నిముషాల పాటు సాగిన భేటీలో గవర్నర్ తో చర్చించిన విషయాలను తెలుపుతూ…
నాపై ఉన్న ఒత్తిడి మేరకే రాజీనామా చేసానని, అసెంబ్లీలో బలనిరూపణ కోసం అవకాశం ఇవ్వాలని, మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని, రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయంటూ చెప్పి బాంబు పేల్చారు. సహజంగా భేటీ వివరాలను చెప్పడం వరకు బాగానే ఉంది గానీ, ‘ధర్మమే గెలుస్తుంది, మంచి రోజులు రాబోతున్నాయని’ చెప్పడం శశికళ వర్గంలో ఆందోళన రేపే అంశాలు.
చిరునవ్వుతో పన్నీరు చెప్పిన తీరును చూస్తుంటే… లోపల గవర్నర్ వద్ద అసలేం జరిగింది? అందులోనూ కేవలం 15 నిముషాలకే భేటీ ముగియడం కూడా మరింత ప్రాధాన్యతను దక్కించుకుంది. మరికాసేపట్లో శశికళ కూడా తన మందిగామధులతో కలిసి గవర్నర్ ను కలవనుంది. దీంతో ఆమె ఏం చెప్తారో అన్న ఆసక్తి నెలకొంది. అయితే పన్నీర్ సెల్వం మాత్రం ‘చిన్నమ్మ’కు ప్రతిక్షణం ‘క్లైమాక్స్’ను చూపిస్తున్నారనే చెప్పాలి.



