ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరవై ఏళ్ల వయస్సులో కూడా కష్టపడి పనిచేస్తున్నారని, రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు పాటు పడుతున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మండుటెండల్లో సీఎం పర్యటిస్తుంటే వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఖాళీగా కూర్చుని ఆరోపణలు చేస్తున్నారని, జగన్ దృష్టి అంతా సీఎం కుర్చీపైనే ఉందని దుయ్యబట్టారు. సీఎం కుర్చీ కోసం పాకులాడే పార్టీ తమది కాదని, జగన్ ఒంటరి కావడం ఖాయమని, ఆఖరికి బంధువులు కూడా ఆయనకు తోడుగా ఉండరంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు.
వేసవిలో వడగాల్పుల బారిన పడకుండా ఉండేందుకని రాష్ట్ర ప్రభుత్వం చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ముఖ్యంగా బస్టాండ్, రైల్వేస్టేషన్, రద్దీ కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వడగాల్పులపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని, మంత్రుల పనితీరు మెరుగు పర్చేందుకే వారికి ర్యాంకులు ఇవ్వడం జరిగిందని ప్రత్తిపాటి అన్నారు.



