ఆపరేషన్ సింధూర్తో భారత్ సత్తా ఏమిటో యావత్ ప్రపంచదేశాలకు తెలిసి వచ్చింది. గతంలో కూడా భారత్ అటువంటి ఆపరేషన్స్ చేపట్టి పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పింది కూడా.
ముఖ్యంగా విదేశాలలో ఉంటున్న భారతీయులు ఈ ఆపరేషన్ సింధూర్తో సగర్వంగా తలెత్తుకు తిరగగలిగారు. కనుక ఆపరేషన్ సింధూర్ ఖచ్చితంగా మనకి చాలా గర్వకారణమే.
ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆపరేషన్ సింధూర్ని గుర్తుచేసుకోవడం చాలా సమంజసమే. కానీ పదేపదే దాని గురించి చెప్పుకుంటుంటే అది రాజకీయమవుతుంది.
మన గొప్పదనం గురించి ఇతరులు చెప్పుకోవాలి కానీ మనకి మనమే డబ్బా కొట్టుకుంటే ఆ గొప్పదనం క్రమంగా పలుచనవుతుంది. దాని విలువని మనమే తగ్గించుకున్నట్లవుతుంది. పదేపదే చెప్పుకుంటే ఎవరో ఒకరు వేలెత్తి చూపి విమర్శించక మానరు.
పాకిస్తాన్ పాలకులకు, సైన్యాధికారులకు, రాజకీయ పార్టీలకు వక్రబుద్ధి ఉంటే ఉండవచ్చు. అది ఆ దేశ ప్రజల దౌర్భాగ్యం. కానీ అందుకు పాకిస్తాన్ దేశాన్ని, ప్రజలను మనం కించ పరచనవసరం లేదు కదా?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మన దేశాన్ని, అక్కడ నివసిస్తున్న మన భారతీయులను గౌరవించాలని మనం కోరుకుంటాము. కానీ ఆయన అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అందుకు మనమందరం బాధ పడుతుంటాము. కానీ అమెరికా అగ్రరాజ్యం… ట్రంప్కి అహంకారం, నోటి దురుసు ఎక్కువ కనుక ఆయన ఏమన్నా, ఏం చేసినా పడాల్సి వస్తోంది. ఇందుకు ప్రతీ భారతీయుడు బాధ పడుతూనే ఉన్నారు.
మనం (ప్రభుత్వం) కూడా పదేపదే ఆపరేషన్ సింధూర్ ప్రస్తావన చేస్తూ పాకిస్తాన్ని మోకాళ్ళపై కూర్చోబెట్టామని గొప్పగా చెప్పుకుంటూ, మనం కూడా అమెరికా అధ్యక్షుడులాగ వ్యవహరిస్తున్నామా?ఈవిదంగా పొరుగు దేశాన్ని అవమానించడం అవసరమా? అని మన పాలకులు ఆలోచిస్తే బాగుంటుంది.






