గత కొన్నాళ్లుగా శ్రీలంక జట్టు ప్రదర్శిస్తోన్న పేలవమైన నిరంతరాయంగా కొనసాగుతోంది. టీమిండియాతో క్లీన్ స్వీప్ చేయించుకున్న శ్రీలంక, అదే తీరుగా పాకిస్తాన్ తోనూ క్లీన్ స్వీప్ చేయించుకుంది. అయిదు వన్డేల సిరీస్ ను 5-0తో కోల్పోయిన లంకేయులు, టీ20లలో కూడా అదే తీరును కొనసాగిస్తూ మొదటి టీ20లో పరాజయం పాలయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులను నమోదు చేసింది.
ఒక దశలో 106 పరుగులకు ఒక వికెట్ కోల్పోయి పటిష్ట దశలో ఉన్న శ్రీలంక 119 పరుగులు చేరుకునే సమయానికి 9 వికెట్లు కోల్పోయిందంటే ఎంత పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన ఇచ్చారో అర్ధం చేసుకోవచ్చు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో శ్రీలంక జట్టు మ్యాచ్ పై పట్టు సాధించింది. చివరి ఓవర్లో 12 పరుగులు చేయాల్సి ఉండగా, అప్పటికే పాకిస్తాన్ 8 వికెట్లు కోల్పోయింది.
ఈ తరుణంలో క్రీజులో ఉన్న షాబాద్ ఖాన్ ఒక బౌండరీ, సిక్సర్ సాధించి పాకిస్తాన్ కు విజయం అందించాడు. దీంతో పాకిస్తాన్ కు అనూహ్యమైన విజయం దక్కింది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ ను పాక్ వైపుకు మలుపు తిప్పిన షాబాద్ ఖాన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో వరుసగా శ్రీలంకపై ఆరవ విజయాన్ని నమోదు చేసి ‘సిక్సర్’ సక్సెస్ ను అందుకుంది పాకిస్తాన్.


