గతవారం విడుదలైన మలయాళ చిత్రం “పేట్రియట్”పై చాలా విభిన్నమైన విశ్లేషణలు వినిపించాయి. సాధారణంగా ఒక సినిమా యావరేజ్ గా ఉందని కొందరు, పర్లేదని కొందరు, బాలేదని ఇంకొందరు అనడం సర్వసాధారణం. కానీ.. “పేట్రియట్” విషయంలో విచిత్రంగా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అదిరిపోయిందని తమ రివ్యూలు పోస్ట్ చేయగా.. మరో సైడ్ పరమ చెత్త అంటూ తిట్టిపోశారు. దాంతో అసలు సినిమా ఎలా ఉంది అనేది ఎవరికీ అర్థం కాలేదు.
ఆఖరి నిమిషంలో సెన్సార్ ఇష్యూస్ కారణంగా మిగతా భాషల్లో విడుదలవ్వలేక.. ప్యాన్ ఇండియన్ రిలీజ్ ప్లాన్ చేసి కూడా, మలయాళం వెర్షన్ రిలీజ్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది “పేట్రియట్” చిత్రం. మమ్ముట్టి టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో మోహన్ లాల్ ఎక్స్ టెండెడ్ క్యామియో రోల్ చేయగా.. ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటించాడు. నయనతార, దర్శన రాజేంద్రన్ కీలకపాత్రలు పోషించారు.
అయితే సినిమా విషయానికి వస్తే.. చాలా ప్రామిసింగ్ గా స్టార్ట్ అయిన సినిమా మెల్లమెల్లగా రెగ్యులర్ రివెంజ్ డ్రామాగా మారిపోయింది. ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే ధైర్యం చేయలేక.. చాలా ఇంపార్టెంట్ ఇష్యూని రెగ్యులర్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ గా చూపించారు. అందువల్ల.. ఆ పాయింట్ తాలూక్ పొటెన్షియల్ డైల్యూట్ అయిపోయింది.
అలాగే.. 125 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమా అంటూ ప్రమోట్ చేయడం కూడా మైనస్ అయ్యింది. గ్రాఫిక్స్, ఫైట్స్ చాలా పేలవంగా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ తేలిపోయింది. కాకపోతే.. మమ్ముట్టి స్క్రీన్ ప్రెజన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ & క్లాస్ టేకింగ్ అనేది కొంతమేరకు సినిమాని కాపాడింది. ఓవరాల్ గా.. మరీ తిట్టుకునే స్థాయి సినిమా అయితే కాదు అని చెప్పొచ్చు. ఈ రిజల్ట్ తర్వాత మిగతా భాషల్లో డబ్బింగ్ వెర్షన్ థియేటర్లలో రిలీజ్ చేస్తారా? లేక ఎందుకొచ్చిందిలే అనుకుని ఓటీటీకే ఇచ్చేస్తారా అనేది చూడాలి.




