ఏపీ డీజీపీగా రాష్ట్రానికి ఎలాంటి సేవలు అందించారో పక్కన పెడితే, అధికార పార్టీకి మిక్కిలి విధేయతను ప్రదర్శించారనే టాక్ ను సొంతం చేసుకున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆకస్మిక బదిలీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అంశంపై జనసేన అధినేత పేస్ బుక్ వేదికగా వైసీపీ సర్కార్ ను నిలదీశారు.
పాలనాపరమైన అధికారంలో భాగంగా సవాంగ్ ను బదిలీ చేసే సౌలభ్యం వైసీపీకి ఉండొచ్చు. కానీ ఇంత హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏముంది? దీనికి గల కారణాలను ప్రజలకు వివరించాలి. ఎందుకంటే విజయవాడలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేసిన ర్యాలీ విజయవంతం అయినందుకు ‘రిటర్న్ గిఫ్ట్’లో భాగంగా సవాంగ్ ను బదిలీ చేసినట్లు భావించాల్సి వస్తుంది.
అలాగే ప్రభుత్వానికి అత్యంత విధేయులుగా ఉన్న వారినే బదిలీ చేయడానికి వెనుకాడడం లేదని, చిన్నపాటి ఉద్యోగి నుండి అందరిని హెచ్చరించడానికి ఇదొక ఉదాహరణగా చూపించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లుగా జనసేన అధినేత అభిప్రాయపడ్డారు. గతంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీని ఇది గుర్తు చేస్తోందని అన్నారు.
నిజానికి సవాంగ్ బదిలీ ఒక్క పవన్ కళ్యాణ్ కే కాదు, రాష్ట్రమంతటా కూడా చర్చనీయాంశం అయ్యింది. జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని డీజీపీగా నియమించేందుకే ఈ బదిలీ అన్న వాదన కూడా హల్చల్ చేస్తోంది. ఈ జాబితాలో కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి పేరు ప్రధానంగా వినపడుతోంది.
ఏది ఏమైనా జగన్ మూడేళ్ళ పాలన + డీజీపీగా గౌతమ్ సవాంగ్ తీరు… రాష్ట్రంలో నిలిచిపోయే విధంగా ఉంటుందన్న విమర్శలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఆరోపిస్తోంది. టీడీపీ ప్రధాన కార్యాలయంలో పట్టపగలే దాడి చేసినా ఇప్పటివరకు ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయకపోవడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు.



