రొటీన్ రాజకీయాలు చేయను… అనవసరంగా ఎవరిని విమర్శించను… అంటూ చెప్పిన ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ రొటీన్ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. రెండు రోజుల క్రితం టిడిపిపై చేసిన విమర్శలను కొనసాగిస్తూ మరోసారి ప్రభుత్వంపై మండిపడ్డారు. గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన పవన్, అతిసార వ్యాధితో బాధపడుతున్న రోగులను పరామర్శించారు.
ఇప్పటికే చాలామంది చనిపోయారని, వారందరికీ ఎక్స్ గ్రేషియా ప్రకటించి వెంటనే గుంటూరులో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేసారు. ఇలాగే ఏ మంత్రి ఇంట్లోనో, ఏ ఎమ్మెల్యే ఇంట్లోనో, ఏ బ్యూరో క్రాట్ ఇంట్లోనో జరిగితే సైలెంట్ గా ఉంటారా? అంటూ మండిపడిన పవన్, ఇలాంటి వారికి జర్నలిస్ట్ లు కూడా అండగా నిలవాలని, ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా పవన్ చెప్పుకొచ్చారు.
‘టార్గెట్ టిడిపి’గా సాగుతున్న పవన్ విమర్శలలో… వ్యవస్థను మొత్తం నాశనం చేసేసారని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అంటే ఇదేనా?, మీరు చేసిన తప్పుల వలన జరుగుతోంది ఇదంతా, 908 కోట్లను ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది, వాటిని ఎలా ఖర్చు పెట్టారు అనేది వివరణ కావాలంటూ మరోసారి అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో చెలరేగిపోయారు ‘జనసేన’ అధినేత.



