తానూ ఏపీలోని అనంతపురం నుండి పోటీ చేసినప్పటికీ, తెలంగాణాలో కూడా పార్టీ పోటీ చేస్తుందని, రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ‘జనసేన’ బరిలో దిగుతుందని స్పష్టం చేసారు పవన్. అయితే ఏపీ రాజకీయాలు పవన్ కు అలవాటైన నేపధ్యంలో… ఎన్నికల సమయంలో పవన్ ఏ పార్టీపై విరుచుకుపడినా, అది పెద్ద సంచలనం కాకపోదు. అధికార పార్టీ టిడిపిని విభేదించినా, ప్రతిపక్ష పార్టీ వైసీపీని ఎండగట్టినా అది రొటీన్ రాజకీయంలో భాగమే అవుతుంది.
కానీ, తెలంగాణాలో పరిస్థితి వేరు.గత ఎన్నికలలో టిడిపి కూటమికి సహకారం ఇచ్చినా పెద్దగా ప్రభావితం చూపలేకపోయారు. అలాగే గడిచిన రెండు, మూడు సంవత్సరాలుగా తెలంగాణా గురించి పవన్ ప్రస్తావించిన సందర్భాలు చాలా అరుదు. అదీ గాక ఒకటి, రెండు సందర్భాలలో కేసీఆర్ ను ప్రశంసించారు కూడా. మరి అలాంటి పవన్ ఏ సిద్ధాంతాలతో తెలంగాణాలో ప్రచారం చేస్తారు? ఏ అంశాలతో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారు? అన్నది మిక్కిలి ఆసక్తికరంగా మారింది.
ఒకప్పుడు కేసీఆర్ వేరు… ప్రస్తుతం ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తున్న కేసీఆర్ వేరు. తెలంగాణాలో బలమైన క్యాడర్ గలిగిన టిడిపిని కూడా చిన్నాభిన్నం చేసిన ఘనత కేసీఆర్ సొంతం. ఇక కాంగ్రెస్ ను ఏం చేశారన్నది చెప్పుకోవడం కూడా వృధా. మరి అంత శక్తివంతమైన కేసీఆర్ ను ఎదుర్కోవడంలో సరైన ప్లానింగ్ లేకపోతే, తెలంగాణా ప్రజల ముందు బొక్కాబోర్లా పడడం ఖాయం. ఎందుకంటే తెలంగాణాలో పవన్ కంటే కేసీఆర్ కే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఏపీలో తడబడినట్లుగా పవన్ వేసిన అడుగులు, తెలంగాణాలో కూడా పునరావృతం అయితే, కేసీఆర్ చుక్కలు చూపించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
అయితే సంగారెడ్డిలో జరగనున్న ‘జనసేన’ తొలి బహిరంగ సభలో దీనికి ఎంతో కొంత సమాధానం అయితే లభించవచ్చు. తెలంగాణా మాజీ ఎమ్మెల్యే, రాజకీయంగా పవన్ కు సన్నిహితుడు అయిన జగ్గారెడ్డి మద్దతుతో ముందుగా సంగారెడ్డి నుండి ప్రారంభించాలనుకుంటున్నట్లుగా పొలిటికల్ టాక్. అలాగే ఇటీవల ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్ కు వచ్చిన సమయంలో, ప్రజల నుండి భారీ స్పందనను తెచ్చుకోవడంతో, ప్రారంభానికి ఇదే ఉత్తమమైన ప్రదేశంగా పవన్ ఎంపిక చేసుకున్నట్లున్నారు.



