ఏపీ ఎన్నికలలో గేమ్ చేంజర్‌ ఎవరు?

Pawan-kalyan-Chandrababu-Modi-Amit-shah-jagan-sharmila

ఇంతకాలం ఏపీలో వైసీపి వెర్సస్ టిడిపి, జనసేనలు అన్నట్లు సాగేది. ఇప్పుడు వైఎస్ షర్మిల కూడా ఎంట్రీ ఇచ్చారు. టిడిపి, జనసేనల పొత్తులతో అలాగే ఈసారి రాష్ట్రంలో కాపు సామాజికవర్గం ఎన్నికలలో కీలకం కాబోతోంది.

ADVERTISEMENT

మరోసారి ఎన్నికలలో విజయం సాధించడమే లక్ష్యంగా వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి తన పార్టీ అభ్యర్ధులలో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. అమరావతి, విశాఖ రాజధాని అంశం ఎలాగూ ఉండనే ఉంది. ఇవన్నీకాక మోడీ, అమిత్ షాలు ఏపీ రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం కూడా ఉంది.

కనుక ఈసారి ఎన్నికలలో గేమ్ చేంజర్‌ ఎవరు?ఏమిటి?అని ఆలోచిస్తే వీటిలో ప్రతీ అంశం గేమ్ చేంజర్‌గానే కనిపిస్తోంది. కానీ వీటన్నిటినీ ప్రభావితం చేసేది ఒకటే ఉంటుంది. అదే గేమ్ చేంజర్‌. అది ఏమిటి?

వైఎస్ షర్మిల రాకపోయి ఉంటే టిడిపి, జనసేనల పొత్తులు గేమ్ చేంజర్‌ అయ్యేవి. కానీ ఆమె సడన్ ఎంట్రీతో వాటి పొత్తుల ఎఫెక్ట్ తగ్గుతుంది.

నేటి నుంచి ఈ నెలాఖరు వరకు అటు శ్రీకాకుళం నుంచి ఇటు తిరుపతి వరకు పర్యటించబోతున్నారు. రాష్ట్రంలో రెడ్డి, కాపు, బీసీ, ఎస్సీఎస్టీ వర్గాల నేతలను, ముఖ్యంగా వైసీపి మంత్రులు, నేతలను ఆకర్షించడానికే ఆమె యాత్రలని వేరే చెప్పక్కరలేదు. కనుక ఈ వారం రోజుల యాత్రతో ఆమె రాష్ట్ర రాజకీయాలను ఏమేరకు ప్రభావితం చేయగలరో కొంత స్పష్టత వస్తుంది.

ఏపీ రాజధాని, రాష్ట్రాభివృద్ధి విషయంలో జగన్మోహన్‌ రెడ్డికి నిబద్దత, దూరదృష్టి లేకపోయి ఉండవచ్చు. కానీ ఎన్నికలలో ఏవిదంగా విజయం సాధించాలనే దానిపై పూర్తి స్పష్టత ఉంది. అందుకోసం గత నాలుగున్నరేళ్ళుగా ఆయన చేసుకున్న ఏర్పాట్లు, పధకాలు, టిడిపిని తుడిచిపెట్టేయడానికి చేస్తున్న ప్రయత్నాల గురించి అందరికీ తెలుసు.

ఇప్పుడు పార్టీ అభ్యర్ధులలో చేస్తున్న మార్పులతో ఎన్నికలలో పార్టీ దెబ్బతింటుందని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు. వైసీపిలో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే జగన్మోహన్‌ రెడ్డికి ఈవిషయం తెలియకనే మార్పులుచేర్పులు చేస్తున్నారనుకోలేము. కనుక ఖచ్చితంగా ఆయన లెక్కలు ఆయనకున్నాయి. ఆయన లెక్కలు ఫలిస్తే ఎన్నికలలో అదే గేమ్ చేంజర్‌ అవుతుంది.

రాష్ట్రంలో ఒక్క వైసీపి తప్ప మిగిలిన అన్ని పార్టీలు అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నాయి. వైసీపి మూడు రాజధానులు, విశాఖ రాజధాని అని కాలక్షేపం చేసింది. కనుక ఎన్నికలలో ప్రతిపక్షాలు అమరావతిపై ఎక్కువగా చర్చ జరిగేలా చేయగలిగితే వైసీపి ఓటమి తప్పదు.

ఎన్నికలు దగ్గరపడుతున్నా మోడీ, అమిత్ షాలు ఏపీ బీజేపీకి దిశానిర్దేశం చేయకపోవడం ఆలోచింపజేస్తోంది. వారికి వైసీపి, టిడిపి, జనసేన మూడు పార్టీలు లోక్‌సభ ఎన్నికల తర్వాత అవసరమైతే మద్దతు ఇస్తాయి. కనుక ఏపీ శాసనసభ ఎన్నికలలో ఎవరికీ నష్టం కలుగచేయకుండా ఒంటరిగా పోటీ చేసే ఆలోచనలో వారు ఉండి ఉండవచ్చు.

వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని చూస్తే, జగన్మోహన్‌ రెడ్డి వైసీపిలో చేస్తున్న మార్పులు చేర్పులు, ఏపీ రాజకీయాలపై వైఎస్ షర్మిల ప్రభావం రెండే గేమ్ చేంజర్స్‌గా కనిపిస్తున్నాయి.

వైసీపిలో మార్పుల వలననే ఆ పార్టీ గెలవచ్చు లేదా ఓడిపోవచ్చు. కానీ వైసీపి ఓటమికి వైఎస్ షర్మిల ప్రధాన కారణం కావచ్చు! వైసీపి ప్రభుత్వంపై, అన్నపై ఆమె చేయబోయే ఆరోపణలతో కొంత, వైసీపి నేతలను చీల్చుకుపోవడం వలన మరికొంత నష్టం తప్పదు.

ఆమె వస్తూనే చంద్రబాబు నాయుడుని విమర్శించినప్పటికీ, కాంగ్రెస్‌ అధిష్టానం సూచన మేరకు పరోక్షంగా టిడిపి, జనసేనల గెలుపుకు సహకరించడం ఖాయమే. కనుక ఈసారి ఎన్నికలలో వైఎస్ షర్మిల గేమ్ చేంజర్‌ కావచ్చు.

ADVERTISEMENT
Latest Stories