ఏపీలో ఇసుక, మద్యం విధానాలు, చెత్తపన్ను రద్దు, దీపావళికి మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ వగైరా తదితర అంశాలపై నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపామని చెప్పుకున్నారు. ఎన్నికల హామీలు అమలుచేస్తుండటం అభినందనీయమే.
కానీ ఇప్పటికే వార్తలన్నీ మీడియా, జనాల నోళ్ళలో నానినాని చాలా పాతబడ్డాయి. కనుక వాటి గురించి మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం వలన ప్రభుత్వానికి, కూటమిలో పార్టీలకి రాజకీయంగా అదనపు మైలేజ్ ఏమీ దొరకకపోవచ్చు.
కర్నూలు జిల్లా, ఓర్వకల్లులో డ్రోన్ పరిశ్రమల కోసం హబ్ ఏర్పాటు. దానికి సంబందించిన వార్తలు రాష్ట్ర ప్రజలనే కాక ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలను కూడా ఆకట్టుకున్నాయి.
తెలంగాణలో కేసీఆర్ పదేళ్ళ పాలనలోనే ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఫ్లైఓవర్లు, అండర్ పాస్ రోడ్లు అన్నీ కలిపి దాదాపు 35కి పైగా నిర్మించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక వంతెనలు, ఫ్లైఓవర్లు నిర్మించారు. చెరువులను టాంక్ బండ్లుగా అభివృద్ధి చేశారు.
ఎక్కడికక్కడ పచ్చదనం పెంచారు. గ్రామాలలో కూడా రోడ్లు, కాలువలు, విద్యుత్ వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేశారు. అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని కేసీఆర్, కేటీఆర్ నిరూపించి చూపారని అనుకోవచ్చు.
కనుక అటువంటి అభివృద్ధికి నోచుకోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆవిదంగా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. త్వరలోనే అది చూస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
జగన్ హయాంలో కొత్తగా రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మించకపోగా ఆయన ప్రభుత్వం నిర్వాకం వలన రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలు పడ్డాయి. తక్షణం వాటి మరమత్తులు ప్రారంభిస్తామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. కానీ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కొత్తగా అనేక రోడ్లు, ఫ్లైఓవర్లు అత్యవసరంగా నిర్మించాల్సి ఉంది.
ప్రజలు ఎదురుచూస్తున్న అమరావతి, పోలవరం, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి, జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఏమైనా నిర్ణయాలు తీసుకొని చెప్పగలిగితే బాగుంటుంది కదా?




