టిడిపి, జనసేనల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ శాసనసభ ఎన్నికలకు సీట్ల సర్దుబాట్లపై చర్చలు మొదలుపెట్టడంతో రెండు పార్టీలతో పాటు వైసీపి కూడా ఆతృతగా ఎదురుచూస్తోంది.
ఇంతకాలం వాటిని దూరంగా ఉంచేందుకు విఫల ప్రయత్నాలు చేసిన వైసీపి, దాని బాకా మీడియా ఇప్పుడు జనసేనకు ఎక్కువ సీట్లు లభించకపోతే అన్యాయం జరిగిన్నట్లే అనే కొత్తరాగం ఆలపించడం మొదలుపెట్టాయి. అది జనసేన మీద ప్రేమతో కాదని అర్దమవుతూనే ఉంది.
గత ఎన్నికలలో ఏపీలో, తాజాగా తెలంగాణలో కూడా జనసేన పోటీ చేసి బోర్లాపడినందున, ఈసారి కూడా జనసేనకు వీలైనన్ని ఎక్కువ సీట్లు లభిస్తే, అవన్నీ తామే గెలుచుకోవచ్చని వైసీపి ఆశ పడుతోంది. పవన్ కళ్యాణ్ కూడా వీలైతే ముఖ్యమంత్రి కావాలనుకొంటున్నానని బహిరంగంగానే చెపుతున్నారు.
కనుక టిడిపితో సమానంగా తమకూ సీట్లు ఉండాలని జనసేన నేతలు, కార్యకర్తలు కోరుకోవడం సహజమే. అయితే ఇది వైసీపి ఉచ్చులో చిక్కుకోవడమే అవుతుందని గ్రహిస్తే ఖచ్చితంగా గెలిచే సీట్లతో అవి 10-15 అయినా వాటితో సరిపెట్టుకోక తప్పదు.
తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ నేతలందరూ బేషజాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేసినందునే, కేసీఆర్ అంతటివాడిని ఓడించి అధికారంలోకి రాగలిగింది. కనుక ఆంధ్రాలో టిడిపి, జనసేనలు కూడా ఇదేవిదంగా వైసీపిని గద్దె దించి అధికారంలోకి రావడం కోసం కొన్ని త్యాగాలకు సిద్దపడక తప్పదు.
టిడిపి ఇప్పటికే పలుమార్లు అధికారంలో ఉంది కానీ జనసేన ఇంతవరకు ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. కనుక ఇప్పుడు సర్దుకుపోగలిగితే గెలిచి అధికారంలోకి వచ్చాక పదవులు పంపకాలు పెద్ద సమస్య కానేకాదు. కానీ వైసీపిలో ఉచ్చులో చిక్కుకొనో లేదా తమ శక్తిసామర్ధ్యాలను ఎక్కువగా అంచనా వేసుకోనో పట్టుబట్టి ఎక్కువ సీట్లు తీసుకొంటే, జనసేన ఎలాగూ నష్టపోతుంది. దాంతో పాటు టిడిపి కూడా నష్టపోతుంది.
కనుక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే ఈ దశలోనే టిడిపి, జనసేనలు రెండూ విజ్ఞతతో వ్యవహరిస్తూ, సీట్ల సర్దుబాట్లు చేసుకోవడం చాలా అవసరం.




