పవన్ “చేనేత గర్జన” సభ హైలైట్స్!

Pawan Kalyan Cheneta sabhaగుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన చేనేత సత్యాగ్రహ సభలో ప్రసంగించిన పవన్ కీలక విషయాలు వెల్లడించారు. అందులో ప్రధాన హైలైట్స్…
· మార్చి14న జనసేన పార్టీ వెబ్ సైట్ ప్రారంభిస్తామని, దాని ద్వారా 2019 మ్యానిఫెస్టో తయారీకి సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు.

· 2019 ఎన్నికల్లో జనసేన ఖచ్చితంగా పోటీ చేస్తుందని, తాను కూడా పోటీ చేస్తానని, అయితే తనకు అధికారం ముఖ్యం కాదని, ప్రజలు చిత్తశుద్ధి కలిగిన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అలాంటి నాయకులనే తాను ఎంచుకుంటానని, పలువురు నేతలు తనతో కలిసేందుకు వస్తున్నారని, అయితే ప్రజల కోసం కష్టాలకు వెరవని నాయకుల కోసం తాను చూస్తున్నానని అన్నారు.

ADVERTISEMENT

· కష్టాల్లో ఉన్నప్పుడే ఒక నాయకుడి అసలు నైజం వెల్లడవుతుందని, తన భుజం మీద ఉండేది ‘గబ్బర్ సింగ్’ సినిమాలోని తుండు కాదని, ఈ తుండుకి కుల, మత, వర్గ, వర్ణ, భావ భేదాలు తెలియవని, అందుకే తాను దీనిని భుజంపై ధరిస్తానని అన్నారు.

· తనకు ఒక్కరు ఓటేసినా, కోట్లాదిమంది ఓట్లేసినా ప్రజల పక్షానే నిలబడతానని, రాజకీయ మురికిలోకి ఎందుకు అడుగు పెడతావయ్యా? అని చాలా మంది తనను హెచ్చరించారని, అయితే తాను లోపల నిర్మలంగా, శుభ్రంగా ఉన్నానని, మురికిలోకి వెళ్లినా… తాను మురికిని కడుక్కోగలనని తెలిపారు.

· తాను పలు సంస్ధలు, వస్తువులకు కమర్షియల్ బ్రాండింగ్ చేస్తే కోట్ల రూపాయలు తన అకౌంట్ లోకి వస్తాయని, కానీ తనకు కోట్లు అక్కర్లేదని, అందులో ఆనందం లేదని, చేతి వృత్తులపై ఆధారపడిన మన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చేనేతను ప్రోత్సహించాలని, అందుకే తాను చేనేత బ్రాండింగ్ కు స్వచ్ఛందంగా అంగీకరించానని అన్నారు.

· తనను విస్తరాకులేరుకునేవాడని కించపరిస్తే బాధపడనని, అలాంటి వ్యక్తులు లేకుండా సమాజం శుభ్రంగా ఉండదని తనను విమర్శించిన వారు గుర్తించాలని, ఒక వ్యక్తి చేసే పనికి గౌరవమివ్వకుండా రాజకీయ నాయకులు మాట్లాడితే… వారు కొన్ని పనులు, కొన్ని వర్గాలను కించపరిచేవారవుతారని హితవు పలికారు.

· సినిమాలకు పైరసీ ఉన్నట్టే చేనేతలకు పవర్ ల్యూమ్ పరిశ్రమ ఉందని, పవర్ ల్యూమ్ పేరుతో చట్టాలను ఖూనీ చేస్తుంటే ప్రభుత్వాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయని, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చేనేతకు అండగా ఉంటామని చెప్పాయని, అయితే ఇల్లు అలకగానే పండగ కాదని, హామీ ఇవ్వగానే పని పూర్తి కాదని, దానిని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

· ప్రత్యేక హోదా పోరాటంలో అరెస్టైన ప్రతి జనసేన కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తామన్నారు? తరువాత ఎందుకు ఇవ్వమన్నారు? అన్న నిజాలు ఆయా పార్టీలు వెల్లడించే వరకు ప్రత్యేక హోదా కోసం పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

· డీమోనిటైజేషన్ కారణంగా డబ్బున్నవారెవరూ ఇబ్బందులు పడలేదని, కేవలం మధ్య తరగతి, పేదలు మాత్రమే చాలా ఇబ్బందుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని, అలాగే ఈ రంగాలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని, గ్రాంట్స్ కోరాలని వంటి చాలా డిమాండ్స్ తన ముందుకు వచ్చాయని, వాటిని పరిశీలించి, భవిష్యత్ పోరాటం దేనిపై చేయాలో నిర్ణయిస్తానని తెలిపారు.

· పవన్ కల్యాణ్ చేపట్టిన చేనేత బ్రాండ్ అంబాసిడర్ కార్యక్రమం విజయవంతం కావాలంటూ పండితులు వేద మంత్రాలు పఠించి, అంతా శుభం జరగాలని కాంక్షించారు. ఈ సమయంలో వారి మంత్రాలు వింటూ పవన్ కల్యాణ్ పడిపడి నవ్వాడు. ఈ క్రమంలో తన నవ్వును నియంత్రించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమై మళ్లీ నవ్వేశాడు. ఈ ఘటన వేదిక దగ్గర, టీవీల ముందున్న వారిలో కూడా చిరునవ్వులు పూయించింది. గతంలో పలు సందర్భాల్లో తాను మూర్ఖ భక్తుడిని కాదని పవన్ కల్యాణ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories