జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. జనసేన ఆవిర్భావసభ తరువాత ఆయన ఎందుకనో కాస్త అయోమయంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న స్పెషల్ స్టేటస్ మీద ఏమీ చేయకపోగా, రాష్ట్రంలోని వేరే విషయాలను పెద్దవి చేస్తున్నారు. కొందరు ఆరోపిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ ఎందుకో అసలు విషయాన్నీ పక్కదారి పట్టిస్తున్నారు అనే అనుమానం ఆయనే కలిగిస్తున్నారు.
గుంటూరులో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను పవన్కల్యాణ్ ఈరోజు పరామర్శించారు. భుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. 48 గంటల్లోగా ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోతే గుంటూరులో బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. మరోవైపు మొన్నటివరకు అవిశ్వాసం పెట్టాలని సవాల్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానిపై రూట్ మార్చినట్టుగా కనిపిస్తుంది.
“అవిశ్వాసం విషయంలో టీడీపీ, వైసీపీకి క్లారిటీ లేదు. అవిశ్వాసం విషయంలో ఇంత గందరగోళం ఎందుకు?. ఇంత హడావుడిగా అవిశ్వాస తీర్మానాలు ఎందుకు పెట్టారు?,” అని పవన్ కళ్యాణ్ అన్నారు. హడావిడిగా అవిశ్వాసం ఎందుకు అనే మాట చాలా తప్పుడు సంకేతాలు పంపుతున్నాయి. పవన్ కళ్యాణ్ కు బీజేపీకు లోపాయికారి ఒప్పందం ఉందన్న చంద్రబాబు ఆరోపణకు ఊతం ఇచ్చేలా ఉంది.
అవిశ్వాసం పెట్టే అంశంలో రెండు పార్టీలు తేదీలను ముందుకు, వెనక్కి జరుపుతున్నాయన్నారు. అవిశ్వాస తీర్మానంపై తెదేపా, వైకాపా ఒక్కటయ్యాయని అంటున్నారని.. అక్కడే వారి కుమ్మక్కు అర్థమవుతోందని పవన్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు రాష్ట్రప్రయోజనాలకు రెండు పార్టీలు కలిసి పనిచెయ్యాలని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట మారుస్తున్నారు అనే అభిప్రాయం కలిపిస్తున్నారు.
కేంద్రంపై ఒక్క జనసేన మాత్రమే పోరాటం చెయ్యగలదు అని చెబుతూనే ఆ దిశగా ఆయనకు ఆసక్తి ఉన్నట్టుగా కనబడటం లేదు. అవిశ్వాసం పెడితే పక్క రాష్ట్రాలకు వెళ్లి మద్దత్తు కూడగడతా అని ఇచ్చిన హామీ గురించి కూడా ఆయన మాట్లాడటం మానేశారు. ఒకవేళ కేంద్రంపై పోరాటం చేస్తున్నట్టే చెప్పాలి కానీ చెయ్యకూడదు అన్నట్టుగా వ్యవహరిస్తే అది ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టే అని ఆయన గుర్తించాలి.



