కాకినాడ లో నిర్వహించిన స్వతంత్ర వేడుకలలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ప్రతిపక్ష పార్టీ నాయకుల ఓటు చోరీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
తమ పార్టీ ఓడితే ఉండే ఓటు చోరీ గెలిస్తే గుర్తురాదా.? 2019 ఎన్నికలలో వైసీపీ 151 సీట్లతో గెలిచినప్పుడు లేని ట్యాపరింగ్ ఆరోపణలు నేడు కూటమి విజయంతో తెరమీదకొచ్చిందా.? నాడు మేమెప్పుడైనా వైసీపీ విజయం అక్రమమని ఆరోపించామా.?
ఇది ప్రజా తీర్పు అంటూ వైసీపీ గెలుపు ని స్వాగతించాము, ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలిచాము అంటూ పవన్, జగన్ ఈవీఎంల టాంపరింగ్ ఆరోపణలకు, కాంగ్రెస్ నేత రాహుల్ ఓటు చోరీ విమర్శలకు తనదైన స్టైల్ లో బదులు చెప్పారు.
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలలో వైసీపీ ఘోర ఓటమికి ముందే ఆ అవమానాన్ని అంచనా వేసిన వైసీపీ అధినేత వైస్ జగన్ ఈ ఓట్ల చోరీ అంశాన్ని, ఈవీఎంల టాంపరింగ్ అంశాన్ని లేవనెత్తారు.
సార్వత్రికల ఎన్నికలలో వైసీపీ ఓటమికి ఈవీఎంల టాంపరింగ్ అంటూ ఆరోపిస్తున్న వైసీపీ, జడ్పీటీసీ ఎన్నికలలో బ్యాలట్ పద్డతిలో జరిగిన ఓటింగ్ ను రిగ్గింగ్ అంటూ విమర్శిస్తోంది. అంటే వైసీపీ గెలిచే వరకు రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్నా, జరగబోయే ఏ ఎన్నికైన వైసీపీ దృష్టిలో అరాచకమే అవుతుందా.?
అలాగే అటు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ సైతం బీజేపీ పై ఓట్ చోరీ అంటూ నిందలు వేస్తున్నారు, ప్రధాని మోడీ పై విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో పవన్ తన కౌంటర్ తో అటు కాంగ్రెస్ కు ఇటు వైస్సార్ కాంగ్రెస్ కు చోరీ చురకలు అంటించారు.
అయితే నేడు సతీసమితంగా స్వతంత్ర వేడుకలలో పాల్గొన్న పవన్, అటు పిదప సూపర్ సిక్స్ హామీలో కీలకమైన మహిళల ఉచిత బస్సు “స్త్రీ శక్తి” కార్యక్రమానికి హాజరయ్యి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ తో కలిసి ఉండవల్లి నుంచి విజయవాడ పండిట్ నెహ్రు బస్సు స్టేషన్ వరకు ఆర్టీసీ లో ప్రయాణం చేసారు.






