ఏపీలో దేశముదురు వైసీపీ నేతలతో ఒంటరి పోరాటం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఇటీవల చిరంజీవి, నాగబాబు నిలబడగా, ఇప్పుడు ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా మాట్లాడటం విశేషం. ఇటీవల విదేశం నుంచి తిరిగివచ్చిన తనకు బ్రో సినిమా వివాదం గురించి తెలిసిందని, దానికి కౌంటరుగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళపై సినిమా లేదా వెబ్ సిరీస్ తీస్తానని ఒకరు అన్నట్లు విన్నానన్నారు.
పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా అందుకే తాను స్పందించవలసి వస్తోందని చెపుతూ, “మీకు మీకు ఏమైనా ఉంటే రాజకీయాలలో తేల్చుకోండి అంతేకాని మీ రాజకీయాలతో సంబంధం లేని మాలాంటి ఆడవాళ్ళని, మా పిల్లలని వాటిలోకి లాగవద్దని అందరినీ అభ్యర్ధిస్తున్నాను. నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. వాళ్ళకి ఈ రాజకీయాలు, గొడవలు ఏమీ తెలియవు. కనుక అభంశుభం తెలియని పిల్లలను ఈ బురదలోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు. మమ్మల్నే కాదు ఏ తల్లులను, పిల్లలను కూడా మీ గొడవలలోకి లాగవద్దని” రేణూ దేశాయ్ విజ్ఞప్తి చేశారు.
పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి అవాకులు చవాకులు వాగుతున్న వైసీపీ నేతలందరికీ కూడా పనిలోపనిగా ఆమె గడ్డిపెట్టారు. పవన్ కళ్యాణ్ అసలు డబ్బు కోసం ప్రాకులాడే మనిషి కారని, ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారని రేణూ దేశాయ్ అన్నారు. పవన్ కళ్యాణ్ తన రాష్ట్రానికి, ప్రజలకు ఏమైనా చేయాలనే తపనతో తన కుటుంబాన్ని వదులుకొని రాజకీయాలలోకి వచ్చారని అన్నారు. తాను మొదటి నుంచి పవన్ కళ్యాణ్కు రాజకీయంగా మద్దతు ఇస్తూనే ఉన్నానని, ఇకపై కూడా ఇస్తూనే ఉంటానని రేణు దేశాయ్ చెప్పారు. ప్రజల కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్కు ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని రేణు దేశాయ్ విజ్ఞప్తి చేశారు.
నిజానికి ఇలాంటి సందర్భాలలో చాలామంది తమ మాజీలపై పగ తీర్చుకోవాలనే ప్రయత్నిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ మాజీ భార్యలలో ఏ ఒక్కరూ ఆయనను పల్లెత్తు మాట అనలేదు. పైగా ఇప్పుడు మాజీ భార్య రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ ఉన్నత వ్యక్తిత్వం కలవారని, ఆయన ప్రజల కోసమే రాజకీయాలలోకి వచ్చారని మీడియా ద్వారా ప్రజలకు చెపుతున్నారు.
రేణూ దేశాయ్ చెప్పిన ఈ నాలుగు ముక్కలు వైసీపీ నేతలకు చెంప దెబ్బ వంటివే కానీ దేశముదురు వైసీపీ నేతలు ఆమె మాటలను కూడా వక్రీకరించి కొత్త అర్ధాలు చెపొచ్చు. కానీ ఆమె చెప్పిన మాటలు ప్రజలు తప్పక అర్దం చేసుకొంటారు.
నిజానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో నేరుగా మాట్లాడే చొరవ గల పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలతో ఇన్ని మాటలు పడాల్సిన అవసరం ఉందా?కానీ పవన్ కళ్యాణ్ ఏనాడూ తన బంధాలను, పరిచయాలను తనను తాను కాపాడుకోవడం కోసం వాడుకోవాలని అనుకోలేదు. అదే వైసీపీ నేతల అదృష్టంగా చెపొచ్చు.



