ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిరంజీవి రాసిన లేఖలో “రాజకీయ పరిణితి” అనే ఒక సున్నితమైన పదాన్ని వినియోగించారు. నిజానికి చిరంజీవి ఏ మేరకు ‘రాజకీయ పరిణితి’ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే గానీ, ఆయన సోదరుడు ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కు మాత్రం కావాల్సినంత ఉందని మరోసారి నిరూపించుకుంటున్నారు. పార్టీ వ్యవస్థాపన రోజు పవన్ చెప్పిన ‘కుల రాజకీయాలకు తానూ దూరం’ అన్న మాటకు, సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం నిజంగా అభినందించదగ్గ విషయం.
‘కాపులకు రిజర్వేషన్’ కల్పించడమనేది ఒక్క రోజులోనో, ఒక్క నెలలోనో, అలాగే ఒక్క సంవత్సరంలోనో తేలే విషయం కాదు. అది ఉద్యమం చేపడుతున్న ముద్రగడకు తెలుసు… అలాగే ఇప్పుడు ముద్రగడ నెత్తిన పెట్టుకుంటున్న జగన్ ‘మీడియా అండ్ కో’ అయితే మొన్నటి వరకు ఈ అంశానికి అసలు ప్రాధాన్యతే ఇవ్వలేదు. ఇక, కాపు సామజిక వర్గపు రాజకీయ నాయకుడిగా ముద్రపడిన సినీ హీరో చిరంజీవికి అయితే… ఈ అంశంలో ఉన్న అవగాహన గురించి మనం ప్రస్తావించకపోవడం శ్రేయస్కరం. కానీ, వీరంతా… ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించడానికి అవకాశం చిక్కింది కదా అని… చంద్రబాబు మీద మండిపడుతూ కామెంట్లు మీద కామెంట్లు, లేఖల మీద లేఖలు సంధిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏమిటి… వారు చేస్తున్న డిమాండ్లు ఏమిటో తెలిస్తే… చిరంజీవి గారు చెప్పిన “రాజకీయ పరిణితి” అర్ధమవుతుంది. వినడానికి పదాలు బాగున్నాయి కదా అని… అర్హత లేని వారు కూడా ‘రాజకీయ పరిణితి’ గురించి ప్రస్తావించడం… మన రాజకీయాలకు చెల్లుబాటు అవుతుందేమో! కానీ, ఈ కుల రాజకీయాలకు దూరంగా కనీసం తన మార్క్ ఓ ట్వీట్ గానీ, జగన్ మాదిరి ఓ ప్రెస్ మీట్ గానీ, తన మెగా సోదరుడు చిరు మాదిరి ఓ లేఖను గానీ విడుదల చేయకుండా పవన్ కళ్యాణ్ అసలైన “రాజకీయ పరిణితి”ని ప్రదర్శించాడని రాజకీయ విశ్లేషకులు కొనియాడుతున్నారు.
ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి మాత్రమే జగన్, చిరంజీవిలు వ్యాఖ్యలు చేస్తున్నారు గానీ, ఎందుకు కాపుల రిజర్వేషన్లు ఇవ్వరు… అది ఎలా సాధ్యమవుతుంది… అని మాత్రం వివరించడం లేదు. ఎందుకంటే… వారికి తెలుసు… అది ఎంత క్లిష్టమైన చర్యో..! అయినప్పటికీ ‘కాపు కార్పొరేషన్’ మీదట 1000 కోట్లు (రాష్ట్రం ఉన్న ఆర్ధిక పరిస్థితులో ఈ మొత్తం చాలా ఎక్కువ) కేటాయించి, సిఎం తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. అలాగే సమస్యను పరిష్కరించడానికి ఓ కమిటీ కూడా వేసారు. పెన్ను, పేపర్ ఖాళీగా ఉందని… మీడియా వాళ్ళకి ఏదొక న్యూస్ కావాలని… ఇలా రాష్ట్ర శ్రేయస్సు పట్టక.., రాజకీయ పరిణితి లేని రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టే… ఏపీ ప్రజల దౌర్భాగ్యం ఈ విధంగా ఉందని భావించాలి..!
ఇక, ఇప్పుడు ఈ కులాల రొచ్చుకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా ఎంత ప్లస్ అవుతుందో ఇప్పుడు తెలియదు. రేపు తానై క్రియాశీలక రాజకీయాల్లోని వచ్చిన నాడు, ఎన్నికల ప్రచారంలో, పార్టీ సిద్ధాంతాలలో తాను చెప్పదలుచుకున్న ప్రధాన పాయింట్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఏ ఒక్క కులం వారో ఓట్లు వేస్తే నిజమైన నాయకుడు కాలేరు. ఆ విషయాన్ని గ్రహించారు, వాటిపై ఒక అవగాహన ఉంది కాబట్టే ఈ రొంపులోకి దిగకుండా తన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు పవన్. అయితే ఈ విషయం పవన్ కంటే వయసులో పెద్ద అయిన చిరంజీవికి… రాజకీయ అనుభవంలో పెద్ద వాడైన జగన్ కు ఎప్పటికీ అవగతమవుతుందో..!



